హైదరాబాద్, జనవరి 29 : మహబూబ్నగర్ జిల్లాలో 60.25 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సాంకేతిక, పరిపాలన అనుమతులు ఇచ్చింది. దీనిపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ హర్షం వ్యక్తంచేశారు. ప్యాకేజీ-1లో భాగంగా బూత్పూర్ నుంచి అమిస్తాపూర్, పాలమూరు యూనివర్సిటీ, వీరన్నపేట, చిందార్పల్లి, హన్వాడ, కోస్గి మీదుగా దుద్యాల గేట్ వరకు రూ.704 కోట్లతో నిర్మించే ఈ రహదారి మహబూబ్నగర్ పట్టణానికి మణిహారంగా నిలువనున్నదని తెలిపారు. కేంద్ర ఉపరితల రవాణా, హైవేల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ చేసిన విజ్ఞప్తులు, రాసిన లేఖలతో కేంద్రం స్పందించిందన్నారు. ప్యాకేజీ-2లో దుద్యాల గేట్ నుంచి కొడంగల్, తాండూర్ మీదుగా కర్ణాటకలోని చించోళి హైవేను కలిపేందుకు అంచనాలను సమర్పించామని చెప్పారు. ఈ సంద ర్భంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, సీఎం కేసీఆర్కు శ్రీనివాస్గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.
మహబూబ్నగర్ రింగు రోడ్డు 75 శాతం పూర్తి
ఈ రహదారి నిర్మాణంతో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు మాదిరిగా మహబూబ్నగర్ పట్టణానికి రింగు రోడ్డు 75 శాతం పూర్తవుతుందని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. హైదరాబాద్కు సమాంతరంగా మహబూబ్నగర్ పట్టణం, జిల్లా అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు. కర్ణాటక రాష్ట్రం నుంచి రాకపోకలు జరిగి పట్టణంతోపాటు జిల్లా అభివృద్ధి జరుగుతుందని ఆకాంక్షించారు.