KGBV Student | పాపన్నపేట, ఏప్రిల్ 2 : తల్లిదండ్రులు ఎవరూ లేని ఒక విద్యార్థినిని సాక్షాత్తు జిల్లా కలెక్టర్ తీసుకువచ్చి పాపన్నపేట కేజీబీవీలో జాయిన్ చేస్తే.. సంబంధిత కేజీబీవీ అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఆ విద్యార్థి మాయమైన సంఘటన బుధవారం పాపన్నపేట కేజీబీవీలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. మెదక్ బాలసదనములో అనాధగా ఉన్న ఓ బాలికను మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తీసుకువచ్చి ఇటీవల పాపన్నపేట కేజీబీవీలో ఎనిమిదో తరగతిలో జాయిన్ చేశారు. అయితే ఆ బాలికను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కేజీబీవీ అధికారులు మాత్రం కనీసం పట్టించుకోలేదు. దీంతో ఆ విద్యార్థిని ఇవాళ ఉదయం అదృశ్యమైన సంఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఇటీవల ఎస్ఓగా బాధ్యతలు చేపట్టిన బాలలక్ష్మి విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం మూలంగానే ఆ బాలిక మాయమైందని, కేజీబీవీ పాఠశాలలోచదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కనీసం విధులను పట్టించుకోకుండా చాలామంది నైట్ డ్యూటీకి గైర్హాజరవుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ఒకరిద్దరు తప్ప మిగతావారు సమయపాలన పాటించడం లేదన్న ఆరోపణలు సైతం ఉన్నాయి.
అటెండెన్స్ తీసుకోగానే..
ఏది ఏమైనా పాఠశాల చుట్టూ పూర్తిగా దుర్భేద్యమైన ప్రహరీ రక్షణ గోడ ఉన్నప్పటికీ ఆ విద్యార్థి ఉదయం అటెండెన్స్ తీసుకోగానే అదృశ్యమవడం వెనుక అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఈ విషయమై సంబంధిత సిబ్బంది జిల్లా విద్యాశాఖ అధికారితోపాటు బాల సదనం సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన పాఠశాలకు చేరుకొని సమగ్ర విచారణ జరుపుతున్నారు.
ఒక మైనర్ బాలిక మాయమవడంతో ఈ విషయం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సంబంధిత అధికారులు సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన పాఠశాల సిబ్బందిపై చర్య తీసుకోవాల్సిందిగా విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.