RS Praveen Kumar | హైదరాబాద్ : జీవ వైవిధ్యాన్ని కాపాడాలంటూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్లు, విద్యార్థుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే జీవ వైవిధ్యాన్ని ధ్వంసం చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్పై బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు.
హెచ్సీయూ బయో డైవర్సిటీ పార్క్ విధ్వంసం, భూముల కుంభకోణంలో కాంగ్రెస్ గుంట నక్కల ముఠాపై వెంటనే సుమోటోగా కింది కేసులు పెట్టాలని ఆర్ఎస్పీ డిమాండ్ చేశారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972లోని సెక్షన్ 29, అటవీ సంరక్షణ చట్టం 1980లోని సెక్షన్ 2, తెలంగాణ వాల్టా చట్టం 2002లోని సెక్షన్ 35 కింద కేసులు నమోదు చేయాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, అతనికి సహకరిస్తున్న మంత్రులందరిని వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపాలి. అప్పుడే తెలంగాణ సురక్షితంగా ఉంటుంది అని ఆర్ఎస్పీ పేర్కొన్నారు.
ఊర్లలో ఎడ్ల బండి మీద ఇల్లు కట్టడానికి వాగు నుండి తట్ట ఇసుకను తీసుకపోతే ఆ బండిని సీజ్ చేసి స్టేషన్లో పెట్టే పోలీసులు, రెవెన్యూ అధికారులకు.. అడవిలో వన్యప్రాణుల ఘోష వినిపించడం లేదా..? బుల్డోజర్లు కనిపించడం లేదా? అని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. అటవీ శాఖా మంత్రి కొండా సురేఖ ఎక్కడ? విద్యార్థులను కిరాయి ఉద్యమకారులన్న రెవెన్యూ మంత్రి పొంగులేటి రియల్ దందాలపై ఉన్నతస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ కడుతున్న కట్టడాలను ప్రజలు ఎవరూ కొనకుండా బహిష్కరించాలి అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.