న్యూఢిల్లీ: సరిహద్దు అంశంపై పార్లమెంట్లో విపక్షాల ఆందోళనలు సోమవారం కూడా కొనసాగాయి. సరిహద్దుల్లో చైనా చొరబాటుపై సమగ్రంగా చర్చించాల్సిందేనని పట్టుబట్టాయి. అయితే ప్రతిపక్షాల డిమాండ్ను రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ తిరస్కరించడంతో కాంగ్రెస్, లెఫ్ట్, డీఎంకే ఇతర పార్టీలకు చెందిన ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. పలు సరిహద్దు ప్రాంతాల్లో చైనా చొరబాటు ప్రయత్నాలపై కేంద్ర ప్రభుత్వం చర్చకు ముందుకు రాకపోవడం సరికాదని విపక్షాలు మండిపడ్డాయి. సరిహద్దు పరిస్థితులపై కాంగ్రెస్ ఎంపీ చిదంబరం, అధికార బీజేపీ సభ్యుల మధ్య రాజ్యసభలో వాగ్వివాదం జరిగింది. గత నెల ఇండోనేషియాలోని బాలిలో జరిగిన జీ20 సదస్సు సందర్భంగా భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మధ్య జరిగిన భేటీలో సరిహద్దు పరిస్థితులపై చర్చ జరిగిందా? అని కేంద్రాన్ని చిదంబరం ప్రశ్నించారు. దీంతో సప్లిమెంటరీ గ్రాంట్లపై చర్చను చిదంబరం పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగారు. స్పందించిన చిదంబరం.. ‘సరిహద్దు అంశంపై చర్చించారా? అని మాత్రమే తెలుసుకోవాలనుకొంటున్నా. ఏం చర్చించారో కూడా నాకు చెప్పొద్దు’ అని అన్నారు. దీనిపై బీజేపీ ఎంపీ నరసింహరావు అభ్యంతరం వ్యక్తం చేశారు.
బయట సింహంలా.. ఇంట్లో ఎలుకలా!
సరిహద్దుల్లో చొరబాటుకు పాల్పడుతున్న చైనాను బీజేపీ ప్రభుత్వం ఎదుర్కోలేకపోవడంతో పాటు.. పార్లమెంట్లో చర్చ చేపట్టకుండా పారిపోతున్నది. మోదీ సర్కార్ దేశం బయట సింహంలా గంభీరపు మాటలు మాట్లాడుతుంది.. దేశం లోపల అయితే ఎలుకలా పిరికితనంతో వ్యవహరిస్తుంది.
-కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
బలమైన ఆర్మీ.. బలహీన కేంద్రం
మన ఆర్మీ చాలా శక్తివంతమైనది. కానీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చాలా బలహీనంగా ఉన్నది. చైనాకు మోదీ సర్కార్ భయపడుతున్నది. చైనా చొరబాటు అంశంపై కేంద్రం అఖిలపక్షాన్ని పిలువాలి. అదేవిధంగా చైనాను ఎలా ఎదుర్కొంటున్నామనే దానిపై పార్లమెంట్లో సమాధానం చెప్పాలి.
-ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ