న్యూఢిల్లీ, జనవరి 6: దేశంలో కరోనా మహమ్మారి దావానలంలా వ్యాపిస్తున్నది. బుధవారం ఒక్కరోజే 90,928 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వీరిలో 495 మంది ఒమిక్రాన్ బారిన పడ్డారు. దీంతో దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారి సంఖ్య 2,630కి పెరిగింది. అత్యధికంగా మహారాష్ట్రలో 797 ఉన్నాయి. కొత్తగా నమోదైన కరోనా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 3,51,09,286కు చేరింది. కరోనాతో బుధవారం 325 మంది చనిపోయారు. మృతుల సంఖ్య 4,82,876కు చేరింది. దేశంలో ప్రస్తుతం 2.85 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా రోజువారీ పాజిటివిటీ రేటు 6.43కు పెరిగింది. ఇప్పటివరకు 148.67 కోట్ల కరోనా డోసులను పంపిణీ చేశారు.
ముంబైలో తొలిసారిగా 20వేలకుపైగా..
దేశ ఆర్థిక రాజధాని ముంబైని కరోనా వణికిస్తున్నది. తొలిసారిగా ఒక్కరోజులోనే 20 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 20,181 మందికి వైరస్ సోకింది. నలుగురు మరణించారు. దేశ రాజధాని ఢిల్లీలో గురువారం ఒక్కరోజే 15,097 కేసులు నమోదయ్యాయి. మే 8 తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. పాజిటివిటీ రేటు 15.34 శాతానికి పెరిగింది. ఆరుగురు మరణించారు.
కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయండి
మండల, జిల్లా స్థాయిల్లో కొవిడ్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి ఆర్తి ఆహూజా లేఖ రాశారు. అవి వాటి వాటి పరిధిలోని ప్రాంతాల్లో కరోనా కేసుల సంఖ్య, ఐసొలేషన్లో ఉన్నవారి ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగానికి తెలియజేయాలని ఆదేశించారు. కొవిడ్ టెస్టింగ్ కేంద్రాలు, అంబులెన్సులు, దవాఖానల్లో బెడ్ల అందుబాటు తదితర విషయాలపై కొవిడ్ కంట్రోల్ రూముల్లో సమాచారం ఉండాలని, అవసరమైన వారికి ఈ సమాచారం అందించాలని పేర్కొన్నారు.
టెస్టుల వేగం పెంచండి
దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న వేళ టెస్టులను తగ్గించడం ఆందోళన కలిగిస్తున్నదని కేంద్ర ప్రభుత్వం తమిళనాడు, పంజాబ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మిజోరం, మేఘాలయ, బీహార్ రాష్ర్టాలకు, జమ్ముకశ్మీర్ యంత్రాంగానికి లేఖ రాసింది. టెస్టులను పెంచాలని ఆదేశించింది.
ఇద్దరు కేంద్రమంత్రులకు కరోనా
కేంద్ర మంత్రులు నిత్యానంద్ రాయ్, భారతీ ప్రవీణ్ పవార్లకు కరోనా సోకింది.రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్కు కూడా కరోనా నిర్ధారణ అయింది.
విమానంలో 125 మందికి పాజిటివ్
ఇటలీ నుంచి పంజాబ్లోని అమృత్సర్కు బుధవారం వచ్చిన చార్టర్డ్ విమానంలో 125 మంది ప్రయాణికులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. విమానంలో మొత్తం 179 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇందులో 19 మంది పిల్లలు. 160 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఒమిక్రాన్ రిస్క్ దేశాల జాబితాలో ఇటలీ కూడా ఉంది.