హనుమకొండ సబర్బన్, ఏప్రిల్ 18: హనుమకొండ జిల్లాలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు సందర్శించా రు. ‘కలెక్టర్ లోడ్ రిటర్న్’ శీర్షికతో గురువారం ‘నమస్తే తెలంగాణ’ మెయిన్లో ప్రచురితమైన కథనం సంచలనంగా మారింది. దీంతో కలెక్టర్ స్పందించారు. జిల్లాలోని తహసీల్దార్లు కొనుగోలు కేంద్రాలను సందర్శించి ధాన్యం కొనుగోళ్లపై ఆరా తీయాలని ఆదేశించారు. ఈ మేరకు అడిషనల్ కలెక్టర్ వెంకట్రెడ్డి ఎల్కతుర్తి మండల కేంద్రంతోపాటు, కేశవాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్ జగత్సింగ్, డీఆర్డీవో డీపీఎం ప్రకాశ్, ఏపీఎం రవీందర్, సివిల్ సప్లయ్ డిప్యూటీ తహసీల్దార్ కృష్ణతో కలిసి సందర్శించారు.
కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యపు రాశులను పరిశీలించారు. ఈ సందర్భంగా వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. కలెక్టర్ పర్యటన నేపథ్యంలో కమలాపూర్ నుంచి వెళ్లిన ధాన్యం లారీ రిటర్న్ రాలేదని, నిర్ణీత కొనుగోలు కేంద్రంలో దిగుమతి జరిగిందని కలెక్టర్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసిందని చెప్పారు. అదేవిధంగా కొనుగోలు చేసిన ధాన్యాన్ని రవాణా చేసేందుకు 5 సెక్టార్ల ద్వారా లారీలను అందుబాటులో ఉంచామని పేర్కొన్నట్టు తెలిపారు.