Sam Pitroda | శ్యాం పిట్రోడా సాంకేతిక నిపుణుడు. రాజీవ్గాంధీ ప్రధానిగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో టెక్నాలజీ మిషన్కు నాయకత్వం వహించిన వ్యక్తిగా ఆయన దేశానికి చిరపరిచితుడు. ఆయన ఇటీవల రెండు అంశాల మీద చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడమే కాకుండా కాంగ్రెస్ను ఇరకాటంలో పడేశాయి. అందులో మొదటిది వారసత్వ పన్నుపై చేసిన వ్యాఖ్య, రెండవది దక్షిణాదివారి రంగుకు సంబంధించిన విశ్లేషణ. వీటిని బీజేపీ తనకనుకూలంగా మార్చుకొని ఎదురుదాడికి దిగడం తెలిసిందే. దక్షిణాది వారి రంగు ఆఫ్రికన్లకు దగ్గరగా ఉంటుందని పిట్రోడా అంటే, రాష్ట్రపతి ముర్మును ఉద్దేశించే ఆయన ఆ మాటలన్నారని బీజేపీ నేతలు కొత్త భాష్యం చెప్పారు. రెండుపార్టీల ధోరణుల మధ్య పెద్దగా తేడా చూడలేం. ఆ సంగతి అలా ఉంచితే పిట్రోడా వ్యాఖ్యలతో ఉత్తర-దక్షిణ వైరుధ్యాలు ప్రముఖంగా చర్చకు వచ్చాయి. మన దేశంలో ఈ విభజన కేవలం భౌగోళికపరమైందే కాదు, సాంస్కృతికపరమైనది కూడా అని చెప్పాలి. భాషాపరంగా ఉత్తరాది ఇండో-ఇరానియన్ వర్గానికి చెందితే.. దక్షిణాది భాషలు ద్రావిడ కుటుంబానికి చెందడం అనే వాదన ఉన్నా అదిక్కడ చర్చాంశం కాదు.
ఉత్తరాది రాజకీయ ఆధిపత్య ధోరణులు ఇటీవలికాలంలో చాలానే చర్చకు వస్తున్నాయి. ఢిల్లీపై ఉత్తరాది వారు పెత్తనం చెలాయిస్తూ దక్షిణాదిని వివక్షకు గురిచేస్తున్నారన్న ఆవేదన దాదాపుగా అన్ని దక్షిణాది రాష్ర్టాల్లో వ్యక్తమవుతున్నది. ఇప్పటివరకు దేశ ప్రధాని పదవి చేపట్టిన 14 మందిలో దక్షిణాది వారు ఇద్దరంటే ఇద్దరే (పీవీ, దేవెగౌడ) ఉండటం ఈ సమస్యకు ఓ ప్రతీకగా చెప్తుంటారు. ఈ విషయంలో జాతీయ పార్టీలుగా విర్రవీగే కాంగ్రెస్, బీజేపీ రికార్డు తెలిసిందే. ఒకరు మొదలుపెడితే మరొకరు దాన్ని పటిష్ఠం చేశారంతే. జనాభా విధానం, పేదరికం అంచనా ప్రాతిపదికలు, నిధుల కేటాయింపు వంటి అంశాల విషయంలో ఉత్తరాది నేతల ఆధిపత్యంలోని కేంద్రం అనుసరిస్తున్న విధానాలు దక్షిణాదికి ప్రతికూలంగా ఉండటమే కాకుండా తీవ్రస్థాయి నష్టం కలిగిస్తున్నాయనే భావ న ప్రబలంగా ఉన్నది. ఉదాహరణకు, దక్షిణాది నుంచి పన్నుల రూపంలో కేంద్రానికి అందుతున్న ఆదాయం ఎక్కువ. అదే సమయంలో కేటాయింపుల రూపంలో అందుతున్న వాటా చాలా తక్కువ. అంటే అధిక ఆదా యం సమకూర్చే దక్షిణాది తక్కువ కేటాయింపులతో సరిపెట్టుకోవాల్సి వస్తున్నదన్న మాట. సంపద సృష్టిలోనే కాకుండా విద్యలోనూ ఉన్నతంగా ఎదిగిన దక్షిణాది రాష్ర్టాలు కుటుంబ నియంత్రణను గణనీయమైన స్థాయి లో పాటించి జనాభా నియంత్రణలో తోడ్పడుతున్నాయి. అదే ఉత్తరాది రాష్ర్టాలు ఈ రెండింటిలోనూ వెనుకబడి ఉన్నాయి. కానీ కేటాయింపులు జనాభా ప్రాతిపదికన జరపాలన్న నిబంధనల వల్ల అధిక నిధులను పొందగలుగుతున్నాయి. అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచినందుకేనా ఈ వివక్ష అని దక్షిణాది రాష్ర్టాలు మథనపడుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన కత్తి దక్షిణాది మెడపై వేలాడుతున్నది. ఉత్తరాది జనాభా అధికం కనుక అక్కడ నియోజకవర్గాలు పెరిగిపోయి దక్షిణాదిలో జనాభా తక్కువ కనుక ఇక్కడ సీట్లు తరిగిపోయే ప్రమాదం ఉన్నది. ఇది ఉత్తరాది రాజకీయ ఆధిపత్యాన్ని మరింతగా పటిష్ఠం చేస్తుందనడంలో సందేహం లేదు. మదరాసీ అనే గుర్తింపు కింద దక్షిణాది భాషల, సంస్కృతులను చాపకిందకు నెట్టడం, అదే పనిగా హిందీని రుద్దడం వంటి సమస్యలు ఎటూ ఉండనే ఉన్నాయి. అయోధ్య రామయ్య గురించి హంగామా చేసేవారు భద్రాద్రి రామయ్య పేరైనా తలవకపోవడం ఏ రకంగా సమర్థనీయం? ఇదేదో రాజకీయాలకే పరిమితమైన సమస్య అనుకుంటే పొరపాటే. ఇటీవల నీట్ పరీక్షను ఏ మాధ్యమంలో నిర్వహించాలనే విషయమై వివాదాలు ముసురుకోవడం దేశ సమైక్యతకు తోడ్పడే అంశమేనా? ఏ రకంగా చూసినా ఉత్తర, దక్షిణ విభజన అనేది ఎన్నాళ్లుగానో పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న లోతైన సమస్య. ఏ దేశంలోనైనా అన్ని ప్రాంతాలూ తమకు సమ ప్రాతినిధ్యం, రక్షణ ఉన్నాయని భావిస్తేనే ఆ దేశం ముందుకు వెళ్లగలుగుతుంది. అమెరికాలో ఉత్తర-దక్షిణ తగాదాలే తీవ్ర సమస్యలకు దారితీసిన సంగతి చరిత్రకు తెలుసు. ఒకప్పుడు జర్మనీ, పాకిస్థాన్, కొరియా తదితర దేశాలన్నీ ఇలాంటి సమస్యలతోనే సైద్ధాంతిక విభేదాల్లో కూరుకుపోయాయి. వివక్షలు, వ్యత్యాసాలపై భారత్లోని దక్షిణాది ప్రాంతీయ పార్టీలు బలంగా గొంతు విప్పుతున్నాయి. వీటినుంచి కర్తవ్య ప్రబోధం పొంది జాతీయపార్టీలు దేశ హితం కోసం తమ విధానాలను మార్చుకొని దిద్దుబాటు చర్యలకు మళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అట్లా కాదని నోటికొచ్చినట్టు మాట్లాడితే ప్రజలు వారికి తిరుగులేని గుణపాఠం చెప్పేరోజు ఎంతో దూరంలో లేదని చెప్పవచ్చు.