2024, మే 6.. సోమవారం రోజున ‘చెలిమె’లో ‘మాట్లాడే వెన్నెముక విశ్వనాథ’ అనే శీర్షికన విశ్వనాథ సత్యనారాయణ గురించి కేతవరపు రాజ్యశ్రీ కొన్ని మంచి విషయాలను చెప్పారు. ‘అవార్డు ఇవ్వడం కంటే మిరపకాయల ధర తగ్గిస్తే సంతోషపడేవాడిని’ వంటి చమక్కులను గుర్తుచేశారు.
తెలుగు సాహిత్యానికి విశ్వనాథ వారికి విడదీయరాని సంబంధం ఉన్నది. తెలుగు సాహిత్యాన్ని తొలిసారిగా జ్ఞానపీఠం ఎక్కించిన ఘనత విశ్వనాథ సత్యనారాయణది. సాహిత్య ప్రియులు విశ్వనాథ సాహిత్యమనగానే ‘అబ్బా…’ అనుకోవడం ఎంత సహజమో.. ‘విశ్వనాథ సాహిత్యం చదువడం మొదలు పెట్టాడా? ఆహా…’ అనుకోవడం కూడా అంతే సహజం.
విశ్వనాథ మాట్లాడే వెన్నెముక.. పాట పాడే సుషుమ్న అని రాజ్యశ్రీ అన్నారు. సుషుమ్నా నాడిని పక్కనపెడితే, విశ్వనాథ రాసిన కిన్నెరసాని పాటలలో కిన్నెరసాని పరికిణీ తొక్కాడు పదేండ్ల కన్యలా సాగిందంటారు. ఇది పల్లె పడుచుల చక్కని అలంకరణ. పదేండ్ల పాప తను ధరించిన పరికిణీని కొంచెం ఎత్తి పట్టి వడివడిగా నడుస్తుంటే, పరికిణీ చివరలు అప్పుడప్పుడు పాదాల కింద పడుతుంటే… ఆ దృశ్యం పల్లె తల్లి హృదయాన్ని గిలిగింతలు పెడుతుంది.
ఇది అందరికీ అర్థమయ్యే అతి చక్కని భావన. ఇలాంటి భావనలు బ్రహ్మానందాన్నే కలిగిస్తాయి. విశ్వనాథ అనగానే కొరుకుడుపడని భాషా ప్రయోగశీలి అని ఎక్కువమంది అనుకుంటారు. విశ్వనాథ కిన్నెరసాని పాటలు వంటి పుస్తకాలు చదువుతుంటే అసలు ఈ ఆలోచన రాదు. ద్రాక్ష పాకంలా అలా అలా సాగిపోతుంది. విశ్వనాథ భారతి పత్రికలో రాసిన నన్నయ్య అక్షర రమ్యత, నన్నయ్య ప్రసన్న కథాకలితార్థయుక్తి, నానారుచిరార్థ సూక్తి నిధిత్వం వంటి వ్యాసాలు చదువరులను మరో లోకానికి తీసుకువెళ్తాయి. మహా భారతాన్ని మరో మంచి కొత్త కోణంలో ఆలోచింపజేస్తాయి.
విశ్వనాథ వారు తమ బాణావతి నవలలో ‘ధాతూనాం అనేకార్థాత్’ అంటూ చేసేవాదన విజ్ఞాన చర్చ ఎలా ఉండాలో చెప్తుంది. విజ్ఞాన మూలాలను ఎలా చూడాలో చెప్తుంది. హితాన్ని కోరేది సాహిత్యం. అయితే సాహిత్య సృష్టికర్త ఆలోచనా ధోరణిని అనుసరించి హితం అహితం అనే అంశాలు కొన్ని ఉంటాయి. కొందరికి సంప్రదాయం హితమైతే మరి కొందరికి అభ్యుదయం హితంగా కనపడుతుంది. తప్పు లేదు. ప్రజలకు అనారోగ్యం కలిగించనిదేదైనా స్వీకరణీయమే. మన వేద పురాణేతిహాసాలలో మంత్రాలను, భక్తిని చూసేవారు కొందరుంటే కథలను చూసేవారు మరికొందరుంటారు.
ఆధ్యాత్మిక ప్రపంచాన్ని చూసేవారు ఇంకొందరుంటారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఇవి చూసేవారే ఎక్కువ. అయితే విజ్ఞానాత్మక విషయాలను చూసేవారు కూడా కొందరుంటారు. సమాజంలోకి ఇంకా అడుగుపెట్టని విజ్ఞానాత్మక విషయాలను చూడటం తప్పు కాదు కదా? సమాజంలో అడుగుపెట్టిన విజ్ఞానాత్మక విషయాలు మా పురాణాల్లో ఉన్నాయనడమే హాస్యాస్పదమవుతుంది. ఏ విజ్ఞాన విషయాలైనా ప్రయోగశాలలో విజయం సాధించాల్సి ఉంటుంది. ప్రయోగశాలలో విజయం సాధించే భావనలు సదా ఉపయోగకరమే కదా?
కవిత్వంలో ఛాందసం, అభ్యుదయం, పురోగమనం, తిరోగమనం కాలమాన పరిస్థితులను బట్టి మారుతుంటాయి. ఒకప్పుడు కవిత్వంలో సంప్రదాయం ఉంటే నేడు అభ్యుదయం ఉంటుంది. ఇది ఎవరికి ఎంతవరకు ఉపయోగపడుతుంది? అనేది లక్ష డాలర్ల ప్రశ్న. ఛాందసవాదులు కొందరు జీవితంలో ఎలా పైకి రావడం లేదో అభ్యుదయవాదులు కొందరు తాము మోసపోతున్నామని తెలిసీ ఏం చెయ్యలేక కంటినీటిని కంట్లోనే కుక్కుకుంటున్నారు. వాస్తవాలు వేరు. వాదాలు వేరు. నిజం చెప్పాలంటే వాస్తవవాదం ఉన్న కవిత్వమే నిజమైన కవిత్వం. అది విశ్వనాథ కవిత్వంలో కొంత ఉందన్నది కాదనలేని సత్యం.
విశ్వనాథ వారి ‘వేయిపడగలు’ నవల అనగానే అందరికీ ధర్మారావు గుర్తుకు వస్తాడు. అతను నవలలో నాయకుడు కాబట్టి అతనే గుర్తుకురావడం సహజం. అయితే వేయిపడగలు నవలలో ఉన్న పసరిక పాత్ర చిత్రణ అనేక ప్రాకృతిక ధర్మాలను, విజ్ఞాన ఛాయలను సంతరించుకొని ఉంటుంది. దానితో పాటు పల్లెటూరి పొలాలు, అక్కడి సంస్కృతి మారుతున్న మానవ విలువలు అక్కడ కనపడుతాయి. వేయి పడగల నాగరాజు అంశ ఛాయామాత్రంగా పసరికలోనే కనపడుతుంది.
ఏ కవి సృష్టించిన సాహిత్యమైనా సంపూర్ణంగా సమాజానికి ఉపయోగపడదు. ఎవరికి నచ్చిన అంశాన్ని వారు తీసుకుంటారు. కాలం మారింది. మారుతుంది. నేడు విజ్ఞాన విషయాలకు అగ్రపీఠం దక్కుతుంది. అంతమాత్రాన విశ్వనాథ భావజాలం ఇప్పుడసలు పనికిరాదనడం పొరపాటు. సంప్రదాయ విజ్ఞానపథాన వేయి పడగల విశ్వనాథ సదా గుర్తుంచుకోదగిన కవి సామ్రాట్. అలాంటి విశ్వనాథవారిని మరొకసారి గుర్తుచేసినందుకు కేతవరపు రాజ్యశ్రీకి ప్రత్యేక ధన్యవాదాలు.
వాగుమూడి , లక్ష్మీరాఘవరావు
98494 48947