మే 23న శత జయంతి
దైవభక్తి; తమకు తెలిసిన, తమ కాలంలో సుస్థిరమైన నైతిక విలువలను నలుగురితో పంచుకోవడంలో ఉన్న తృప్తి; ఈజోడు నడచిన తోవగ మిగిలిన ఆత్మ సంతృప్తి ఇవే ప్రధానంగా సాధారణ కవులను శతక కవులుగా మలిచి ఉంటాయి. అలాంటి కోవకు చెందినవారే ఉత్తర తెలంగాణ ప్రాంతం నిర్మల్ నివాసి మడిపల్లి వీరయ్య. విస్మృత కవిగా పేర్కొనే కన్నా పేరుపై పెద్దగా ఆశ లేని, దైవ చింతనే పరమావధిగా తలచిన కవులలో ఒకరిగా ఇలాంటి వారిని పేర్కొనవచ్చు. ఇది వీరి శతజయంతి వత్సరం. 1924 మే 23న శైవమత ప్రచారమే వృత్తిగా కలిగిన ఆరాధ్య కుటుంబంలో భద్రయ్య, అన్నపూర్ణల జ్యేష్ట పుత్రునిగా జన్మించిన వీరయ్య ఆ బతుకు దారికి చేర్పుగా కవిగా సృజన నందిస్తూ సాగిపోయారు.
మొదట్లో పామరజన రంజకంగా ‘తందనాన లింగలీలలు’ రచించి పాడుతూ భక్తులను ఆకర్షించారు. 1955లో తన ఎరుకన వేములవాడ రాజరాజేశ్వరునిపై ఏ శతకం లేదని, ఆ లోటుకు భర్తీగా శ్రీ వేములవాడ రాజరాజేశ్వర శతక రచనకు ఉపక్రమించారు. బహు కుటుంబీకుడైన వీరయ్య తాను, తన వాళ్ల భారం భగవంతునిదే అని విశ్వసించి అదే మార్గంలో చివరివరకు గడిపారు. తన స్వస్థలం నిర్మల్లో శ్రావణ, కార్తీక మాసాల్లో పురాణాలు చెప్పేవారు. భజన గీతాలను అల్లుతూ ఆలపించేవారు. ఏ క్షేత్రాలను దర్శించినా ఆయా క్షేత్ర మహాత్మ్యాలను కీర్తించడానికి, నోములు, పండుగలు, ఉత్సవాలకూ భక్తిగీతాలు, మంగళ హారతులూ రచించారు.
జ్యోతిష్య శాస్ర్తాన్ని స్వయంకృషితో అభ్యసించి సంప్రదించినవారికి జీవిత మార్గదర్శనం చేసేవారు. షష్ఠిపూర్తి తర్వాత పరమేశ్వర సాన్నిధ్యాన్ని కాంక్షించి, పళ్లూ, పాలు మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ… కాశీక్షేత్ర గర్భవాసంగా తొమ్మిది మాసాలు భార్య గంగమ్మతో సహా గడిపారు. ఈ సందర్భంగా ఉత్పల, చంపకాలతో శ్రీకాశీ విశ్వనాయక శతక రచన చేశారు. చివరి గడియ వరకు శివభజన, ఆ తోవన సృజననే తన వ్యాపకాలుగా కవి వీరయ్య జీవితాన్ని శివాంకితంగా గడిపారు.
శ్రీ వేములవాడ రాజరాజేశ్వర శతక రచనా ధోరణి: ఇంద్రునిచేత ప్రతిష్ఠితంగా విశ్వసించే వేములవాడ రాజరాజేశ్వరుని గురించి ‘వాసవార్చిత వేములవాడ వాస! శ్రీశ సన్నుత! రాజేశ! చిద్విలాస!!’ అన్న ద్విపాద మకుటంతో సీసపద్యాలలో 30 ఏండ్ల ప్రాయంలో వీరయ్య శ్రీ వేములవాడ రాజరాజేశ్వర శతకం రచించారు. పామర జనరంజకంగా సాగిన ఈ శతకంలో పూర్వ శతక కవుల ధోరణి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. 18వ శతాబ్దపు ధర్మపురి శేషప్ప కవి పద్యాల ప్రభావం ఈ శతకంపై ఎంతో ఉన్నది. శేషప్ప కవి పద్యాలు అప్పటికే ప్రజల్లో ఎంతో పరివ్యాప్తమైనందున, సామాన్య జనులకు భక్తి, ముక్తులతో కూడిన సూక్తులనందించడమే తన ధ్యేయంగా వీరయ్య ఆ తోవనే తన శతక రచన కొనసాగించారు.
‘నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత..’ అన్న శేషప్ప కవిలా ‘రాజేశ నీ మంత్రరాజ జపంబున’ అంటూ మంత్ర ప్రభావాన్ని పాదపాదాన ప్రస్తుతించారు. ‘పసరంబు జైడ్డెన పశుపాలకుని తప్పు’ అన్న శేషప్ప కవి తోవనే ‘పశువు ద్రిమ్మరియైన పశుపాలకుని తప్పు’ అంటూ పద్యాన్ని నడిపారు. చాలా ప్రసిద్ధమైన శేషప్ప కవి ‘లక్షాధికారైన లవణమన్నమెగాని మెరుగు బంగారమ్ము మింగబోడు’ అన్న పద్యోక్తిని ‘కోటీశ్వరుండైన కూడుగుడ్చునె కాని కనకంబు నెన్నడు తినడు యుర్వి!’ అంటూ అనుసరించారు.
‘దాసిన చుట్టూ మా శబరి? దాని దయామతి నేలినావు; నీదాసుని దాసుడా? గుహుడు తావకదాస్య మొసంగినావు’ అంటూ రామదాసు రాయగా, వీరయ్య కవి‘బాణాసురుని కోట బంటువై గాచిన బత్తెమే మిచ్చెనో భర్గ! నీకు’ అంటూ తన ఆర్తిని ప్రకటించారు. కవి వీరయ్య పూర్వ శతక కవులను అనుకరించడమే కాకుండా తనదైన మార్గంలోను ఈ శతకాన్ని నడిపారు. శివుని 25 లీలలు, వేములవాడ క్షేత్ర మహిమ, ద్వాదశ జ్యోతిర్లింగ వర్ణనల సందర్భాల్లో కవి ప్రత్యేకత ప్రస్ఫుటమవుతున్నది.శివుని మహా నాట్యలీలను వర్ణిస్తూ..
‘శౌరి మృదంగంబు స్రష్టయు తాళంబు పద్మజ ఢక్కయు వాణివీణ’ అంటూ ఆ నాట్య సన్నివేశాన్ని కండ్లముందు సాక్షాత్కరింపజేశారు. వేములవాడలో కోడెమొక్కు, గంట కట్టడం మొదలైన భక్తుల నమ్మకాలను కవి పద్యంలో ఇలా తెలిపారు.‘విశ్వేశ నీపేర వృషభ వత్సము నిడపుత్ర పుత్రికలను పొందగలరు!మాహేశ నీగర్భ మంటపంబున ఘంటగట్టగ వాగరి గలుగునయ్య!’ కవి వీరయ్య భక్తి గీతాలు, మంగళ హారతులు ఏవైనా ధారాశుద్ధి కలిగి చెవుల్లో అమృతం పోస్తున్నంత హాయిగా ఉంటాయి.
‘గౌరీసుత! గణపతి మత్కృత కలుషంబుల నెడబాపుమురా!
వారణముఖ! భవకాననసీమను బాయు నుపాయము తెలుపుమురా!!’ అని గణేశ నవరాత్రి ఉత్సవాలలో రాశారు.
‘శ్రీ సరస్వతీ! శివకరి! సురనర వందిత! శ్రీ సరస్వతీ!వ్యాసపుర నివాసిని! భవపాశంబిల బాయగ, నీ ధ్యాన జేతు నిరతము, నా దోషంబుల బాపుమంబ! శ్రీ సరస్వతీ!’ఇది బాసర క్షేత్రంలో రాసిన గీతం.‘హారతిదే గైకొనుమా అంబా! భవానీ! హరురాణి- ఆరాధింతును నీ చరణములన్ ఆలకింపుమా మొర సత్కరుణన్..స్మరహరణా స్థిర కరుణా! హర శివ హారతి గైకొనరా’ అంటూ కవి వీరయ్య సందర్భశుద్ధిగా రాసిన ఎన్నో గీతాలు, హారతులలో మచ్చుకు కొన్ని పాదాలివి.
‘ఉ.పుట్టితి తల్లిగర్భమున పున్నెము పాపములెన్నొ జేసితిన్ గట్టున జేర్తువో కృపను, గంగను ముంతువొ నీదు భారమౌ
పట్టితి నీదునామమున భక్తి జపించుచు వారణాసిలో గట్టిగ కాయమున్ విడుచు కాంక్షను దీర్చవె విశ్వనాయకా!’ అంటూ కవి ఈ శతకంలో మోక్ష కాంక్షనే పరమావధిగా వెలిబుచ్చాడు. అంతా, అన్నింటికీ సర్వేశ్వరుడన్న జ్ఞాననేత్రం తెరచుకున్నవాడై నిత్య పూజలతో ఆ స్వామినే కొలుస్తూ, తలుస్తూ 2008, ఏప్రిల్ 23న శివైక్యమయ్యారు.
మడిపల్లి రాజ్కుమార్
99496 99215