KTR | భద్రాద్రి కొత్తగూడెం : వరంగల్ – నల్లగొండ – ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఓ విద్యావంతుడు పోటీ చేస్తున్నాడు.. కాంగ్రెస్ తరపున ఓ బ్లాక్ మెయిలర్ పోటీ చేస్తున్నాడు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఇల్లందు నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో కేటీఆర్ పాల్గొని బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డికి మద్దతుగా ప్రసంగించారు.
బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డి వరంగల్ జిల్లా వంగపహాడ్లో ఒక సామన్య రైతు కుటంబంలో జన్మించారు. చదువుకున్న వ్యక్తి. మంచి మార్కులు ఇంటర్లో సంపాదించడంతో బిట్స్ పిలానీలో సీటు వచ్చింది. ఇంజినీరింగ్తో పాటు ఎంఎస్ చేసి గోల్డ్ మెడల్ సాధించాడు. ఆ తర్వాత వాళ్ల కుటుంబం సలహా మేరకు అమెరికాలో ఏడేండ్ల పాటు ఐటీ ఉద్యోగం చేశాడు. లక్షల కోట్లు సంపాదించిన సంతృప్తి లేదు. దాంతో తెలంగాణ కోసం ఉద్యమించాలని చెప్పి వరంగల్కు తిరిగొచ్చాడు. 2012 నుంచి 2024 దాకా బీజేపీలో ఉండి బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పోరాటం చేశారు. మొన్న ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా అని చెప్పి మనతో నడుస్తున్నాడు. ప్రజా జీవితంలోకి వచ్చిన విద్యావంతుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఓ బ్లాక్ మెయిలర్ను నిలబెట్టింది. ఆయనపై 56 కేసులు ఉన్నాయి. అవి కూడా స్వాతంత్ర్య ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో నమోదైన కేసులు కావు. జనాలను తిట్టి, బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి, మహిళలల గౌరవానికి భంగం కలిగించినందుకు 56 కేసులు నమోదు అయ్యాయి. కాబట్టి ఓటేసే ముందు అభ్యర్థుల గుణగణాలను పరిశీలించి ఓటేయాలని కోరుతున్నాను అని కేటీఆర్ తెలిపారు.
ఇప్పుడు మనకు కావాల్సింది ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులు.. ప్రభుత్వాన్ని ప్రశంసించే గొంతులు కాదు. మనకు కావాల్సింది ధిక్కారు స్వరాలు.. అధికార స్వరాలు కాదు. ఇవాళ శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి మందబలం ఉంది. మాట తప్పినా మమ్మల్ని అడిగేవారు ఎవరూ లేరనే ధీమా ఉంటది. అదే మండలిలో మన నాయకులు ఉంటే ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీసే అవకాశం ఉంటుంది. పచ్చి అబద్దాలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నాడు రేవంత్. ఆరు గ్యారెంటీలకు ఐదు గ్యారెంటీలు అమలు చేశానని రేవంత్ నిస్సిగ్గుగా చెబుతున్నాడు. ఒక్క ఫ్రీ బస్సు మాత్రమే అమలైంది. ఫ్రీ బస్సుపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని కేటీఆర్ తెలిపారు.