KTR | ఇల్లందు : బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాట్లప్పుడు కేసీఆర్ రైతుబంధు వేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఓట్లప్పుడు రేవంత్ రెడ్డి రైతుబంధు వేశారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. నాట్లప్పుడు రైతుబంధు వేస్తే లాభం.. కోతలప్పుడు వేస్తే ఏం లాభం అని రేవంత్ సర్కార్ను కేటీఆర్ నిలదీశారు. ఇల్లందు నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో కేటీఆర్ పాల్గొని బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డికి మద్దతుగా ప్రసంగించారు.
తెలంగాణలో ఏ గ్రామానికి, పట్టణానికి, జిల్లా కేంద్రానికి వెళ్లిన ప్రస్ఫుటమైన మార్పు కనబడుతుంది. బీఆర్ఎస్ హయాంలో వ్యవసాయం బాగైంది. 2014లో వ్యవసాయ ఉత్పత్తుల్లో తెలంగాణ 14వ స్థానంలో ఉండే. 2023 నాటికి వ్యవసాయ ఉత్పత్తుల్లో ముఖ్యంగా వరి ధాన్యంలో హర్యానా, పంజాబ్ను తలదన్ని అగ్రస్థానానికి ఎగబాకింది. రైతు కుటుంబాలకు భరోసా ఇచ్చే విధంగా కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టిండు. కేసీఆర్ హయాంలో రైతుబంధు నాట్లు వేసేటప్పుడు పడ్డది. కానీ రేవంత్ ప్రభుత్వంలో ఓట్లు వేసేటప్పుడు పడ్డది. కోతలప్పుడు వేస్తారా రైతుబంధు. నాట్లప్పుడు వేస్తే విత్తనాలకు, ఎరువులకు ఆ నగదు ఉపయోగపడేది అని కేటీఆర్ తెలిపారు.
నాకు ఒక్క అవకాశం ఇస్తే డిసెంబర్ 9న 2 లక్షల రుణమాఫీ చేస్తానని రేవంత్ అన్నాడు. జూన్ 9 వస్తుంది.. ఆరు నెలలు గడిచిపోయింది. కానీ రుణమాఫీ కాలేదు. హామీలు అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కడిగి పారేయాలంటే.. దమ్మున్న ఏనుగుల రాకేశ్ రెడ్డిని గెలిపించాలి. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్కు 39 సీట్లు వచ్చాయి. 1.8 శాతం ఓట్ల తేడాతో ఓడిపోయాం. 15 సీట్లలో ఐదారు వేల ఓట్ల తేడాతో ఓడిపోయాం. ఈ పదిహేనులో 7 నుంచి 10 గెలిచినా ప్రభుత్వం వచ్చేది అని కేటీఆర్ తెలిపారు.