ఓ బిడ్డకు జన్మనివ్వాలంటే..
ఆ మాతృమూర్తికి అది పునర్జన్మే! ప్రైవేటు వైద్యశాలల్లో కాసులు కురిపించనిదే కాన్పులు కష్టమయ్యే పరిస్థితుల నుంచి నేడు సర్కారు దవాఖానల్లో సుఖప్రసవాలు చేసి తల్లీబిడ్డలను క్షేమంగా ఇంటికి పంపిస్తున్న రోజులు వచ్చాయి. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నారు. వైద్య నిపుణులను అందుబాటులో ఉంచడంతో పాటు అధునాతన వైద్య పరికరాలు సమకూరుస్తూ కార్పొరేట్ స్థాయి సేవలందిస్తున్నారు. వీటికి తోడు కేసీఆర్ కిట్ పథకం ప్రవేశపెట్టి బాలింతలకు ఆర్థిక ప్రోత్సాహాన్ని అందజేయడంతో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెరుగుతున్నది. ఆరోగ్య ప్రదాతగా నిలుస్తున్న కేసీఆర్ను తల్లులందరూ నిండు మనస్సుతో దీవిస్తున్నారు. ఆయన.. దేశానికీ నాయకత్వం వహించాలని కోరుకుంటున్నారు.
ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 28: పేదవాడైనా… శ్రీమంతుడైనా ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తారు. ధనవంతులు వైద్యం కోసం ఎన్ని డబ్బులైనా ఖర్చు చేసేందుకు వెనుకాడరు. కానీ పేదకుటుంబాలకు సర్కారు దవాఖానలే దిక్కు. ఒకప్పుడు ప్రభుత్వ దవాఖానకు పోవాలంటే భయపడిన జనాలు.. నేడు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, సంక్షేమ పథకాలతో ప్రతి ఒక్కరూ క్యూ కడుతున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక ప్రజారోగ్యానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారు. పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏరియా, జిల్లా దవాఖాలను పూర్తిగా ఆధునీకరించారు. సరిపడా వైద్యసిబ్బంది నియామకంతోపాటు ప్రత్యేక వైద్య నిపుణులను అందుబాటులోకి తెచ్చారు. అన్ని వ్యాధులకు చికిత్స చేస్తున్నారు.
అధునాతన వైద్య పరికరాలను ఏర్పాటుచేసి కార్పొరేట్స్థాయిలో సేవలందిస్తున్నారు. ప్రైవేటు వైద్యశాలల్లో అడుగుపెడితే ఉన్నదంతా అమ్ముకొని ఫీజులు కట్టాల్సిన పరిస్థితులు ఉండడంతో నేడు సర్కారు దవాఖానల్లో అందుతున్న సేవలకు ఫిదా అవుతున్నారు. ఎన్నో రోగాలకు ఉచితంగా చికిత్స చేయించుకొని క్షేమంగా ఇంటికి చేరుతున్నారు. పేదలకు ఉచితంగా మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ను ప్రతిఒక్కరూ దీవిస్తున్నారు. ఆరోగ్య భారత్గా తీర్చిదిద్దేందుకు ఆయన జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు.
కేసీఆర్ కిట్తో పెరిగిన ప్రసవాల సంఖ్య..
ప్రధానంగా తల్లీబిడ్డల క్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రవేశపెట్టడంతోపాటు ప్రభుత్వ దవాఖానలో ప్రసవం చేయించుకుంటే ఆర్థిక ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. దీంతో అందరి తల్లుల నుంచి నీరాజనాలు అందుకుంటున్నారు. ప్రైవేటు దవాఖానల్లో నార్మల్ డెలివరీకి రూ. 50వేలు, సిజేరియన్లు చేస్తే లక్షలకు లక్షలు గుంజుతున్న నేపథ్యంలో పీహెచ్సీల్లోనే ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో ఉచితంగానే సుఖ ప్రసవాలు చేసి తల్లీబిడ్డలను క్షేమంగా ఇంటికి పంపుతున్నారు. కేసీఆర్ కిట్ పథకం కింద శిశువులకు అవసరమైన అన్ని రకాల సామగ్రితోపాటు ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందజేస్తున్నారు. దీంతో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. కేసీఆర్ నేతృత్వంలో పల్లె నుంచి పట్నం వరకు విశేష ఆరోగ్య సేవలు అందిసున్న రాష్ట్ర ప్రభుత్వం.. అన్నివర్గాల అభిమానాన్ని చూరగొంటున్నది. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్న కేసీఆర్.. జాతీయ రాజకీయాల్లోకి రావాలని, దేశాన్ని ఆరోగ్య భారత్గా తీర్చిదిద్దాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తున్నారు.
రూపాయి ఖర్చులేకుండా..
మాది భవానీపేట గ్రామం. నేను మొదటి నుంచి గవర్నమెంటు దవాఖానలోనే చూపించుకున్నా. నాకు ఇదే మొదటి కాన్పు. రూపాయి ఖర్చు లేకుండా బిడ్డకు జన్మనిచ్చాను. ప్రైవేటులో ప్రసవం చేయించుకుంటే కనీసం రూ. 50 వేల దాకా ఖర్చయ్యేది. డాక్టర్లు ప్రతిరోజూ వచ్చి నన్ను, నా బిడ్డ ఆరోగ్యం గురించి అడుగుతున్నారు. సమయానికి మందులు ఇస్తున్నారు.
-స్వప్న, భవానీపేట, లింగంపేట మండలం
నెలకు 40 డెలివరీలు చేస్తున్నాం..
రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నది. ప్రభుత్వ దవాఖానల్లో అన్ని వసతులు, అధునాతన వైద్య పరికరాలను సమకూరుస్తున్నది. సరిపడా సిబ్బంది, వైద్యులను కేటాయిస్తున్నారు. ఎల్లారెడ్డిలో నెలకు 40 వరకు ప్రసవాలు చేస్తున్నాం. ఈ నెలలో ఇప్పటి వరకు 32 డెలివరీలు అయ్యాయి. ఇందులో పది సిజేరియన్లు, మిగతావి నార్మల్ డెలివరీలు ఉన్నాయి. కేసీఆర్ కిట్లు అందించి తల్లీబిడ్డలను క్షేమంగా ఇంటికి పంపిస్తున్నాం.
-డాక్టర్ రవీంద్ర మోహన్, సూపరింటెండెంట్, ఎల్లారెడ్డి ఏరియా దవాఖాన
కేసీఆర్ కిట్ బాగుంది.
నేను నాగిరెడ్డిపేట దవాఖానలో ప్రసవం చేయించుకున్నా. ఇంటికి వెళ్లేటప్పుడు కేసీఆర్ కిట్ ఇచ్చిండ్రు. అది చాలా బాగుంది. అందులో పౌడర్, కాటుక, ప్యాంపర్లు, మందు లు, ఆట వస్తువులు ఉన్నాయి. కేసీఆర్ ఇయ్యకపోతే డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వచ్చేది. తల్లీబిడ్డల కోసం ముఖ్యమంత్రి సారు చాలా మంచి పథకాలు ఇస్తున్నారు.
-రొడ్డబోయిన లావణ్య, ఆత్మకూర్, నాగిరెడ్డి పేట మండలం
ప్రైవేటు దవాఖాన లెక్కనే ఉన్నది..
నేను ప్రసవం కోసం ఎల్లారెడ్డి ప్రభుత్వ దవాఖానకు పోయిన. అక్కడ చూస్తే నర్సులు, డాక్టర్లు.. మొత్తం ప్రైవేటు దవాఖాన లెక్కనే ఉన్నది. డాక్టరమ్మ అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నది. వీలైనంత వరకు నార్మల్ డెలివరీనే చేస్తానని చెప్పింది. కొంత కష్టమైనా సాధారణ కాన్పు చేసిండ్రు. ఇక్కడ నర్సులు మా ఇంటోళ్ల లెక్క బాగా చూసుకున్నారు.
-అంజవ్వ, అన్నాసాగర్, ఎల్లారెడ్డి మండలం
ఆపరేషన్ లేకుండానే కాన్పు చేసిండ్రు..
నాకు నెలలు నిండంగనే లింగంపేట గవర్నమెంటు దవాఖానకు పోయిన. నేను అవస్థ పడడం చూసిన నర్సులు.. వెంటనే డాక్టర్కు చెప్పిండ్రు. ఆపరేషన్ చేస్తరేమోనని చాలా భయపడ్డా. డాక్టర్లు, నర్సులు ధైర్యం చెప్పి మామూలుగానే కాన్పు చేసిండ్రు. నేను, నాబిడ్డ ఆరోగ్యంగా ఉన్నాం. అంతా బాగుందని చెప్పారు. మూడు రోజులకే క్షేమంగా ఇంటికి వచ్చేశాం.
-విజయ, నల్లమడుగు తండా, లింగంపేట.
దగ్గరుండి చూసుకున్నరు..
సర్కారు దవాఖానలో కాన్పు చేయించుకునేందుకు భయపడ్డాం. కానీ ఆశ కార్యకర్తలు ధైర్యం చెప్పారు. నార్మల్ డెలివరీ చేసి డబ్బులు కూడా ఇస్తారని మా కుటుంబాన్ని ఒప్పించారు. అయినా బెంగగా ఉండె. ఆమెనే మా వెంట దవాఖాన దాకా వచ్చి మాట్లాడింది. నర్సులు, డాక్టర్లు బాగా చూసుకున్నారు. నార్మల్ డెలివరీ చేసి అవసరమైన మందులు ఇచ్చిండ్రు.
-మార్గం స్వప్నిక, శెట్పల్లి సంగారెడ్డి.
ప్రభుత్వ దవాఖాన చాలా బాగుంది
నేను ప్రభుత్వ దవాఖానలో కాన్పు చేయించుకున్న. ప్రైవేటులో ఉన్నట్టే ఇక్కడ కూడా చాలా శుభ్రంగా ఉంచుతున్నరు. ఉదయం, సాయంత్రం మంచిగా తుడుస్తున్నారు. ఒక్కదోమ కూడా కనిపించడం లేదు. మందులు, ఆహారం ఉచితంగానే ఇస్తున్నారు. డాక్టర్లు ఎంతో ఓపికగా చూస్తున్నారు. ఇక్కడి సిబ్బంది ఒక్క పైసా అడగలేదు. ప్రైవేటుకు పోతే డబ్బుల కోసం ఆపరేషన్ చేస్తుండె.
-అనిత, అడవిలింగాల, ఎల్లారెడ్డి మండలం
సర్కారు వైద్యం మంచిగున్నది..
లింగంపేటలో సర్కారు దవాఖాన మంచిగున్నది. పైసా తీసుకోకుండా కాన్పు చేసిండ్రు. డాక్టర్లు రోజూ వచ్చి చూస్తుండ్రు. పదేండ్ల కింద మా చుట్టాలు ఇక్కడికి వస్తే సరిగ్గా చూడలేదు. కామారెడ్డికి పంపిచ్చిండ్రు. అప్పుడు చాలా కష్టమైంది. ఇప్పుడు దవాఖాన మొత్తం మారిపోయింది. సీఎం సారు పుణ్యమా అని గరీబోళ్లకు సర్కారు దవాఖానలోనే మంచిగ చూస్తుండ్రు.
-లంబాడి స్రవంతి, పోల్కంపేట తండా, లింగంపేట మండలం