గ్రామీణ స్వచ్ఛభారత్ మిషన్లో నిజామాబాద్ జిల్లాకు అవార్డుల పంట పడింది. కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ విభాగంలో జాతీయ స్థాయిలో జిల్లాకు గుర్తింపు దక్కింది. జిల్లాల కేటగిరీలో నిజామాబాద్ మూడోస్థానంలో నిలిచింది. సౌత్ రీజియన్ పరిధిలో రెండో స్థానం దక్కించుకున్నది. దీంతో మరోసారి ఇందూరు పేరు మారుమోగుతుంది. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛ దివస్ను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ అవార్డులను ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ప్రభుత్వ ఉన్నతాధికారులు అందుకోనున్నారు.
-నిజామాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
నిజామాబాద్, సెప్టెంబర్ 22,(నమస్తే తెలంగాణ ప్రతినిధి):గ్రామాల్లో చెత్తా చెదారం ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చేయడం, సేకరించిన చెత్తను నేరుగా డంపింగ్ యార్డులకు తరలించడం, పారిశుద్ధ్య నిర్వహణలో ముందుంటున్న పల్లెలను మరింత మెరుగుపర్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రతి ఇంటి నుంచీ తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి గ్రామానికి దూరంగా తరలించేలా ప్రణాళికలను రూపొందించింది. పంచాయతీలను సుందరంగా మలిచి ప్రజలు వ్యాధుల బారిన పడకుండా చర్యలు తీసుకుంటోంది.
ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో పారిశుద్ధ్య నిర్వహణలో మెరుగ్గా ఉన్న పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అవార్డులను ప్రకటించింది. ఉత్తమ గ్రామ పంచాయతీల పేరిట దేశ వ్యాప్తంగా నిజామాబాద్ జిల్లాకు అవార్డులు వరించాయో లేదో మరోసారి ఇందూర్ ఘనత మారుమోగుతోంది. కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ విభాగంలో జాతీయ స్థాయిలో జిల్లాకు గుర్తింపు దక్కింది. దేశ వ్యాప్తంగా మూడో స్థానంలో, సౌత్ రీజియన్ పరిధిలో రెండో స్థానంలో నిలిచి అవార్డులను దక్కించుకుంది. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛ దివస్ను పురష్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ అవార్డులను ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ప్రభుత్వ ఉన్నతాధికారులు స్వీకరించనున్నారు.
వ్యర్థాల నిర్వహణలో భేష్..
నిజామాబాద్ జిల్లాలో 29 మండలాల్లో 530 గ్రామ పంచాయతీలున్నాయి. పల్లె ప్రగతి పేరిట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏటా సరికొత్త కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఇందులోభాగంగా ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటుగా స్వచ్ఛత కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఊరూరా… వాడవాడలో అమలవుతున్న పారిశుద్ధ్య చర్యల ఫలితంగా నిజామాబాద్ జిల్లాకు మంచి గుర్తింపు దక్కుతోంది. గ్రామాల్లో చెత్తను తగులబెట్టడం, విచక్షణా రహితంగా పారవేయడం తదితరాలకు చెక్ పెట్టాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ గతేడాది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి జిల్లాలో అనేక గ్రామ పంచాయతీల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది.
సమర్థవంతంగా పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తూ పర్యావరణహితంగా మెదిలే విధంగా పాలకవర్గాలను ప్రోత్సహిస్తోంది. పాత ఇంటి శిథిలాలు, రాళ్లు, రప్పలు, పనికి రాని ఇనుము, ప్లాస్టిక్ సామగ్రి, మట్టి, ఇతర ఘన పదార్థాలను సేకరించి వాటిని గ్రామానికి దూరంగా ఉన్న డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడానికి బుట్టలను పంపిణీ చేసి ప్రజల్లోనూ మార్పును తీసుకు వచ్చారు. వాటి ద్వారా ప్రతి రోజూ ఇంటి ముందుకు వచ్చే రిక్షాల్లో చెత్తను వేసేలా ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. పంచాయతీలను మరింత సుందరంగా తీర్చిదిద్దడంపై ప్రత్యేక కార్యాచరణతో దృష్టి పెట్టి పనులు చేయిస్తున్నారు.
విభిన్న అంశాల్లో నిశిత పరిశీలన..
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2022 అవార్డుల జాబితాలో నిజామాబాద్ జిల్లాకు చోటు దక్కడం వెనుక అధికార యంత్రాంగం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పనితీరు, ప్రభుత్వ సహకారం దాగి ఉంది. దేశ వ్యాప్తంగా చేపట్టిన ఈ సర్వేలో పరిశుభ్రత, స్వచ్ఛతా తీరుపై నిశిత పరిశీలన జరిగింది. 2022 స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ సర్వే పారదర్శకంగా చేపట్టారు. గ్రామాల్లోని వీధుల్లో, ప్రధాన కూడళ్లలో స్వచ్ఛ భారత్ మిషన్ బృందాలు క్షేత్ర స్థాయిలో పరిశీలించి ప్రజల నుంచే నేరుగా వివరాలు అడిగి తెలుసుకున్నాయి.
పారిశుద్ధ్య కార్మికుల పనితీరు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం జరిగిందా లేదా? ప్రతి ఇంటి ఆవరణలో మరుగుదొడ్డికి సంబంధించిన సెప్టిక్ ట్యాంక్ ఉందా లేక మురుగు కాల్వలకు వదులుతున్నారా.. అన్న కోణంలో కీలకమైన అంశాలను స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2022 సర్వేలో ప్రాధాన్యం ఇచ్చారు. ప్లాస్టిక్ వాడకం, బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత పల్లెలు వంటి అంశాలను గుర్తించారు. పర్యావరణ పరిరక్షణకు పెద్ద పీట వేసే విధంగా చేపట్టిన పల్లె ప్రకృతి వనాలు, హరితహారంలో నాటిన మొక్కలు వంటివి అవార్డులు రావడానికి అనూకూల అంశాలుగా నిలిచాయి.
సమష్టి కృషికి ఫలితం
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్లో జిల్లాకు అవార్డులు దక్కడం చాలా సంతోషంగా ఉంది. ఇది జిల్లా ప్రజలందరికీ గర్వ కారణం. పల్లె ప్రగతి కార్యక్రమాల అమలు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఆధికారులు, సిబ్బంది సమష్టి కృషితోనే ఇది సాధ్యమైంది. ఇదే స్ఫూర్తితో జిల్లాను మరింత ముందుకు తీసుకుపోతాం.
– నారాయణరెడ్డి, కలెక్టర్ కలెక్టర్, నిజామాబాద్