అడవుల సంరక్షణకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పిలుపునిచ్చారు. అడవుల్లో ఒక్క చెట్టును నరికినా.. ఇంచు భూమి ఆక్రమణకు గురైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అటవీ ప్రాంత సంరక్షణకు సిబ్బంది నిరంతరం నిఘా కొనసాగించాలన్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కలెక్టరేట్లలో బుధవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో పోడు భూములపై మంత్రి సమీక్షించారు. ప్రస్తుతం ఉన్న చట్టాలకు లోబడి అటవీ భూముల్లో వ్యవసాయం చేసుకొని బతుకుతున్న పేదవారికి ఆఖరి అవకాశంగా ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఇవ్వాలని సీఎం సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారన్నారు.
-నిజామాబాద్, సెప్టెంబర్ 21(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
నిజామాబాద్, సెప్టెంబర్ 21,(నమస్తే తెలంగాణ ప్రతినిధి):అడవులను సంరక్షించుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగం కలిసి కట్టుగా పని చేయాలని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి చెప్పారు. అడవులపై గట్టి నిఘా ఉంచాలని చేయాలన్నారు. అర్హులైన పేద గిరిజన కుటుంబాలకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు అందించేందుకు సీఎం కేసీఆర్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం పోడు భూముల సమస్యను కొలిక్కి తీసుకువచ్చేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.
ఇకపై అడవుల్లో చెట్ల నరికివేత అన్నదే కనిపించకూడదని నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్లలో బుధవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఆదేశాలు ఇచ్చారు. కామారెడ్డిలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యే హన్మంత్ షిండే, కలెక్టర్ జితేశ్ వి పాటిల్, నిజామాబాద్లో ఎమ్మెల్సీ వీజీ గౌడ్, కలెక్టర్ నారాయణ రెడ్డి, సీపీ నాగరాజు, అటవీ శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఉభయ జిల్లాల్లో అడవుల విస్తీర్ణం, సిబ్బంది పనితీరు, ప్రస్తుతం కొనసాగుతున్న అడవుల సంరక్షణ చర్యలపై మంత్రి ఆరా తీశారు. హరితహారంతో కలిగిన ప్రయోజనాలపైనా సమీక్ష నిర్వహించారు.
చెట్టు నరికితే జైలుకే..
అడవుల పరిరక్షణలో అవసరమైన చోట పోలీసుల సహకారం తీసుకోవాలని అటవీ శాఖ అధికారులకు మంత్రి చెప్పారు. అటవీ ప్రాంతంలో ఏ ఒక్క చెట్టును నరికినా, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ విషయమై ఇక నుంచి అడవిని, అటవీ భూములను కాపాడుకోవడానికి అంకితభావంతో, చిత్తశుద్ధితో కృషి చేస్తామని అన్ని రాజకీయ పార్టీలు బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఆయా ఫారెస్ట్ రేంజ్ల వారీగా అటవీ విస్తీర్ణం, ఫారెస్ట్ బీట్లు, సిబ్బంది సంఖ్యా తదితర వివరాలపై మంత్రి ఆరా తీశారు. అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్న చోట అదనపు సిబ్బందిని సర్దుబాటు చేయాలని డీఎఫ్వోలకు సూచించారు. 2021లెక్కల ప్రకారం రాష్ట్రంలో 6శాతం అటవీ విస్తీర్ణం వృద్ధి చెందిందన్నారు.
మరో మూడు శాతం కలుపుకుని మొత్తంగా తొమ్మిది శాతం వరకు అటవీ విస్తీర్ణాన్ని పెంచుకోగలిగితే వర్షాభావ పరిస్థితులను నివారించుకుని సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం హరితహారం కార్యక్రమంలో పెద్ద ఎత్తున నిధులు వెచ్చించి పచ్చదనాన్ని పెంపొందించిందని చెప్పారు. ప్రభుత్వ అభిమతానికి అనుగుణంగా అటవీ విస్తీర్ణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని హితవు పలికారు. ఈ సందర్భంగా పోడు భూముల సమస్యల పరిష్కారం కోసం చేపడుతున్న చర్యలు, గ్రామ, డివిజనల్, జిల్లా స్థాయిలో కమిటీల ఏర్పాటుకు చేస్తున్న కసరత్తును కలెక్టర్లు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
సీఎం సాహసోపేత నిర్ణయం
అడవుల పరిరక్షణను సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ భావించేలా ప్రజల్లో అవగాహన పెంపొదించాలని మంత్రి అన్నారు. పోడు భూముల సమస్య పరిష్కారానికి నిబంధనలను అనుసరిస్తూ చేపట్టాల్సిన చర్యల గురించి, అటవీ విస్తీర్ణం పెంపొందించాల్సిన ఆవశ్యకత గురించి యంత్రాంగానికి మంత్రి వివరించారు. ప్రస్తుతం ఉన్న చట్టాలకు లోబడి అటవీ భూముల్లో వ్యవసాయం చేసుకుని బతుకుతున్న పేదలకు ఆఖరి అవకాశంగా ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఈ ప్రక్రియ జరుగుతున్న సమయంలో అటవీ ప్రాంతాల్లో ఏ ఒక్క చెట్టు కూడా నరికివేతకు గురి కాకుండా బీట్ స్థాయిలో పకడ్బందీగా పర్యవేక్షించాలని ఆదేశించారు. నిజామాబాద్ డీఎఫ్వో వికాస్ మీనా, కామారెడ్డి డీఎఫ్వో నిఖిత బోగాలతో పాటుగా ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.