కమ్మర్పల్లి, నవంబర్ 11: రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులు కట్టి రైతులకు సాగు నీరు అందిస్తుంటే.. కేంద్రం వరి కొనుగోలు చేయబోమంటూ పేర్కొనడాన్ని గట్టు పొడిచిన వాగు ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోని కమ్మర్పల్లి మండలం బషీరాబాద్ రైతులు నిరసించారు. గట్టు పొడిచిన వాగు ప్రాజెక్టు జలాలను తమ చెరువులకు అందించడంతో పండుతున్న రెండు పంటలు పండుతున్నాయని తమ 500 ఎకరాల్లో టీఆర్ఎస్ జెండాలు కట్టి ఆనందాన్ని వ్యక్తంచేశారు. వ్యవసాయం పండుగలా సాగుతుంటే కేంద్రంలోని బీజేపీ సర్కారు వరి కొనుగోలు చేయబోమని రైతులను ఇబ్బందులకు గురిచేయడంపై నిరసన వ్యక్తంచేశారు. బషీరాబాద్లో కాడి చెరువు కింద పొలాల రైతులు తమ పొలాల్లో టీఆర్ఎస్, సీఎం కేసీఆర్, రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జెండాలను గురువారం కట్టి పొలాలను గులాబీమయం చేశారు.
గట్టు పొడిచిన వాగు ప్రాజెక్టు జలాలను చెరువులకు అందిస్తామని ఏటా ఎన్నికల సమయంలో ఒట్టేసిన నాయకులు.. ఎన్నికలు కాగానే ఒట్టు తీసి వాగు గట్టు మీద పెట్టారని.. స్వరాష్ట్ర ఏర్పాటు అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వం గట్టు పొడిచిన వాగు జలాలను తమ చెరువులకు అందించిందని రైతులు ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేసీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, కల్వకుంట్ల కవిత జెండాలను తమ పొలాల గట్ల మీద ఏర్పాటుచేసి టీఆర్ఎస్ ప్రభుత్వం రెండు పంటలకు నీళ్లందిస్తున్న ఘనతను గుర్తుచేస్తూ తమ కృతజ్ఞతను చాటారు. ఈ తరుణంలో కేంద్రం వరి కొనబోమని ఇబ్బందులకు గురిచేయడం సరికాదని రైతులు పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేంద్రం వరి కొనుగోలు చేసేలా లేఖ తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు.
రైతులు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టగా.. గ్రామ సర్పంచ్ సక్కారం అశోక్, ఎంపీటీసీ సభ్యురాలు తోట జ్యోతి, రైతు బంధు సమితి గ్రామ కో-ఆర్డినేటర్ బోడ దేవేందర్, మండల కో-ఆర్డినేటర్ బద్దం రాజేశ్వర్, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు బైకాన్ మహేశ్, నాయకులు నాయకులు ఏనుగు గంగారెడ్డి, హల్దె శ్రీనివాస్, బాశెట్టి నాగేశ్, రాజు, అబ్బాస్, నేల్ల రమేశ్, సలివేరి భూమేశ్వర్, కుమ్మరి శ్రీనివాస్, మోతె నర్సయ్య, బశెట్టి, ప్రశాంత్, గంధం మహిపాల్ తదితరులు పొలాల వద్దకు వెళ్లి రైతులకు మద్దతు తెలిపారు.
వడ్లను కేంద్రం కొనుగోలు చేయాలె..
గట్టు పొడిచిన వాగు ప్రాజెక్టు జలాలను సీఎం కేసీఆర్ సారు, మంత్రి ప్రశాంత్రెడ్డి అందించ డంతో రెండు పంటలు సాగు చేస్తున్నాం. ఇలా రెండు పంటలను పండిస్తున్న ఆనందంలో రైతులు ఉండగా.. కేంద్ర సర్కారోళ్లు వరి పంటను కొనబోమని చెప్పడం దారుణం. బండి సంజయ్ వడ్లు కొనేలా కేంద్రం నుంచి లేఖ తేవాలి.