యాదాద్రి, మార్చి 16 : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో నిత్య పూజల కోలాహలం నెలకొంది. బుధవారం వేకువజామున స్వయంభువులకు, బాలాలయ కవచమూర్తులకు ఆరాధనలు జరిపి ఉత్సవ మండపంలో పంచామృతాలతో అభిషేకించి, తులసీ అర్చనలు జరిపారు. అనంతరం లక్ష్మీనరసింహులను దివ్య మనోహరంగా అలంకరించి శ్రీ సుదర్శన హోమం, కల్యాణం, అలంకార సేవోత్సవాలు నిర్వహించారు. రోజూ ఒక్కో రకమైన పూజలు నిర్వహిస్తూ భక్తులు లక్ష్మీనృసింహుడిని కొలుస్తున్నారు. సాయంత్రం వేళ అలంకార జోడు సేవలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. కొండపైన గల శివాలయంలో నిత్యారాధనలు శైవ సంప్రదాయంగా జరిగాయి. అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. శ్రీసత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పాతగుట్టలో నిత్యారాధనలు అత్యంత వైభవంగా జరిగాయి. స్వామివారిని దర్శించుకుని భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. అన్ని విభాగాల నుంచి రూ.6,55,200 ఆదాయం సమకూరిన్నట్లు ఆలయ ఈఓ ఎన్. గీత తెలిపారు.
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ప్రధానాలయ పునర్నిర్మాణంలో భాగంగా ఏర్పాటు చేసిన బాలాలయంలో చివరిసారిగా బుధవారం స్వామివారి కల్యాణోత్సవం, సుదర్శన నారసింహ హోమం జరిపారు. ప్రధానాలయం పునర్నిర్మాణంలో భాగంగా 2016లో ఉత్తర భాగంలో బాలాలయాన్ని వైటీడీఏ ఆధ్వర్యంలో నిర్మించారు. 2016 ఏప్రిల్ 21న లక్ష్మీనరసింహస్వామి కవచమూర్తులను బాలాలయంలో ప్రతిష్ఠించి, ప్రాణప్రతిష్ఠ చేసి స్వామి, అమ్మవార్ల దర్శనానికి నాంది పలికారు. లక్ష్మీనరసింహస్వామి, ఆండాళ్ అమ్మవారు, ఆళ్వారు, క్షేత్రపాలకుడి విగ్రహాలను బాలాలయంలో ప్రతిష్ఠించారు. తాజాగా ప్రధానాలయం పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో చివరిసారిగా స్వామివారి కల్యాణం, సుదర్శన నారసింహహోమం, జోడు సేవలు జరిపి, బాలాలయంలో ఉత్సవాలకు ముగింపు పలికారు. స్వామివారి దర్శనాలు మార్చి 28వరకు బాలాలయంలోనే కొనసాగిస్తామని ఆలయ ఈఓ వివరించారు.