న్యూఢిల్లీ: మావోయిస్టు కార్యకలాపాలకు ఆర్థిక సాయం కేసులో దేశంలోని పలు రాష్ర్టాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాలు నిర్వహించింది. బీహార్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ర్టాల్లో సోదాలు జరిపినట్టు ఓ అధికారి వెల్లడించారు. బీహార్ ప్రత్యేక దర్యాప్తు బృందం, సీఆర్పీఎఫ్ సాయంతో బీహార్లోని జెహానాబాద్, పట్నా రూరల్, అర్వాల్, నలంద, గయ, నవాడ, ఔరంగాబాద్ జిల్లాల్లో, జార్ఖండ్లోని కోడర్మా, ఒడిశాలోని భువనేశ్వర్, ఏపీలోని నెల్లూరు జిల్లాలో మొత్తం 26 ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ చేసింది. బీహార్లోని మగధ ప్రాంతంలోని కార్యకర్తలు, సీపీఐ (మావోయిస్టు) టెర్రర్ ఫైనాన్సింగ్ నెట్వర్క్కు సంబంధించిన కేసులో ఈ సోదాలు జరిగినట్టు ఓ అధికారి పేర్కొన్నారు. సోదాల్లో మూడు నాటు తుపాకులు, 315 రైఫిళ్లు, 59 రౌండ్ల బుల్లెట్లు, డిజిటల్ పరికరాలు, నక్సల్ సాహిత్యం, పలు పత్రాలు, 4 కేజీల నార్కొటిక్ డ్రగ్స్ లభించినట్టు చెప్పారు.