ఇల్లందకుంట/ఇల్లందకుంట రూరల్ : ఉద్యోగాలను ఊడగొడుతూ, పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ ప్రజలపై భారం వేస్తూ, ఉన్న ఆస్తులను అమ్ముతున్న అమ్మకాల బీజేపీ పార్టీనా…. లేక ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతున్న నమ్మకాల టీఆర్ఎస్ పార్టీ కావాల్నా…. ప్రజలు ఆలోచన చేయాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్రావు కోరారు. సోమవారం టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్కు మద్దతుగా ఇల్లందకుంట మండలంలోని రాచపల్లి, టేకూర్తి, శ్రీరాములపల్లి, కనగర్తి గ్రామాల్లో మంత్రి హరీష్రావు ప్రచారం నిర్వహించారు.
ఆయా గ్రామాల్లో వీధి వీధి తిరుగుతూ ఒక్కొక్కరిని పేరుతో పలుకరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి గెల్లు శ్రీనివాసును గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్రావు మాట్లాడుతూ ఇవి నడుమంతరపు ఎన్నికలని, ఎవరైనా చనిపోతే ఎన్నికలొస్తాయి, తమ ప్రాంతానికి అన్యాయం జరిగిందని రాజీనామా చేస్తే ఎన్నికలు వస్తాయి…. కానీ ఈటల రాజేందర్ ఎందు కోసం రాజీనామా చేశారో చెప్పడం లేదన్నారు. హుజూరాబాద్ జిల్లా కావాలని రాజీనామా చేశాడా… మెడికల్ కాలేజీ కావాలని రాజీనామా చేశాడా అని ప్రశ్నించారు. కేవలం స్వార్థం కోసం, అవకాశవాద రాజకీయాల కోసం రాజీనామా చేశాడని విమర్శించారు. ఇప్పుడు పేద ప్రజల నడ్డి విరిచే, రైతుల ఉసురు పోసుకునే పార్టీలో చేరాడన్నారు.
పనులు చేసే పార్టీలకు ఓటెయ్యాలే తప్ప సానుభూతి మాటలకు కాదన్నారు. టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటెయ్యాలో నేను వంద కారణాలు చెప్తా, బీజేపీకి ఎందుకు ఓటు వెయ్యాలో ఒక కారణం చెప్పు అని నిలదీశారు. ఆసరా పెన్షన్ 200 నుంచి 2వేలు పెంచి అమ్మకు పెద్ద కొడుకులా సీఎం కేసీఆర్ ఉన్నారు కాబట్టి టీఆర్ఎస్కు ఓటెయ్యాలని చెబుతా, పేదింటి ఆడపిల్లలకు కులం, మతం లేకుండా కళ్యాణలక్ష్మీ పథకం కింద లక్ష రూపాయలు ఇస్తున్నారు కాబట్టి ఓటెయ్యాలని చెబుతా. నువ్వు ఏం చెప్తావని ప్రశ్నించారు. ఆడపిల్ల గర్భవతి అయితే ఉచితంగా కాన్పు చేసి 12వేలు, కేసీ ఆర్కిట్ టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తుందన్నారు. బడికి వెళ్లడానికి గురుకులాలు పెట్టి ఉచిత విద్య అందిస్తున్నామన్నారు.
రైతులకు ఉచిత కరంటు, రైతుబంధు, రైతుబీమా అందిస్తున్నామని, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కాల్వల ద్వారా నీళ్లు తెచ్చి న ప్రభుత్వం మాదన్నారు. రైతులకు భూమి శిస్తు, నీటి తీరువా రద్దు చేశామని గుర్తు చేశారు. మరీ బీజేపీ వాళ్లు ఏం చేశారు… పెట్రోల్ ధర 107 రూపాయలు, డీజిల్ ధర 100 రూపాయలు, గ్యాస్ సిలిండర్ ధర 1020 చేసి ప్రజల నడ్డి విరుస్తున్నారని దుయ్యబట్టారు. అందరు మంత్రుల్లాగే ఈటల రాజేందర్కు కూడా 4వేల ఇండ్లు ఇస్తే ఒక్కటి కట్టలే దని, మంత్రిగా ఉండి ఇల్లు కట్టలేని ఈటల రాజేందర్ ప్రతిపక్ష ఎమ్మెల్యేగా కడుతాడా ఆలోచన చేయాలని ప్రజలను కోరారు.
గెల్లు శ్రీనివాస్ గెలిచిన తర్వాత పేదలకు 5వేల ఇండ్లు కట్టించే బాధ్యత గెల్లు శ్రీనివాస్తో పాటు నేను తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ నెల 30న ఓటు వేసేందుకు వెళ్లేటప్పుడు మహిళలంతా సిలిండర్కు దండం పెట్టుకొని పోయి సీఎం కేసీఆర్ ఆశీర్వదించిన పంపిన గెల్లు శ్రీనివాస్ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఆయన వెంట ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, టీఆర్ఎస్ నాయకులు పాడి కౌశిక్రెడ్డి, ముద్దసాని కశ్యప్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, సర్పంచ్లు వనమాల, ఆదిలక్ష్మీ, మొగిలి, రజిత, ఎంపీటీసీలు తెడ్ల ఓదేలు, తదితరులు పాల్గొన్నారు.