న్యూఢిల్లీ : దేశంలో చిన్నారులు అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. వివిధ రకాల కారణాలతో రోజుకు 31 మంది బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఈ విషయం నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. 2020లో 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 11,396 మంది పిల్లలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఖ్య 2019 కంటే 18శాతం ఎక్కువ. కొవిడ్-19 మహమ్మారి కారణంగా పిల్లల మానసిక ఆరోగ్యం తీవ్ర ప్రభావం చూపిందని నిపుణులు భావిస్తున్నారు.
ఎన్సీఆర్బీ (NCRB) నివేదిక ప్రకారం.. పిల్లల ఆత్మహత్యల సంఖ్య రెండేళ్ల కిత్రం కంటే 21 శాతం ఎక్కువగా నమోదయ్యాయి. 2019లో 9,613 మంది, 2018లో 9,413 మంది చిన్నారులు ఆత్మహత్య చేసుకున్నారు. 2019తో పోలిస్తే ఈ ఏడాదిలో 1,783 మంది చిన్నారులు జీవితాలను అర్ధాంతరంగా చాలించారు. ఆత్మహత్య చేసుకున్న మొత్తం చిన్నారుల్లో 5,392 మంది బాలురు.. 6,004 మంది బాలికలు ఉన్నారు.
అయితే, కుటుంబ సమస్యలతో 4,006, ప్రేమ సంబంధిత కారణాలతో 1,337 మంది, అనారోగ్య సమస్యలతో 1,327 మంది, పేదరికం, మాదకద్రవ్యాల వినియోగం, ఆత్మనూన్యత, నిరుద్యోగం తదితర కారణాలు చిన్నారుల ఆత్మహత్యలకు దారితీశాయని నిపుణులు భావిస్తున్నారు. కరోనా మహమ్మారితో సామాజిక జీవనానికి దూరం కావడం, విద్యా సంస్థలు మూసివేయడంలాంటి కారణాలతోనూ చిన్నారులు మానసిక కుంగుబాటుకు గురైనట్లు పేర్కొంటున్నారు.
పిల్లల ఆత్మహత్యల నేపథ్యంలో సేవ్ ది చిల్డ్రన్ సంస్థ డెప్యూటీ డైరెక్టర్ ప్రభాత్కుమార్ మాట్లాడుతూ కొవిడ్ మహమ్మారి సమయంలో పాఠశాలలు మూసివేయడం, ఇంట్లో పరిస్థితులను చూసి పిల్లల మానసిక ఆరోగ్యం క్షీణించిందని పేర్కొన్నారు. కుటుంబంలోని పిల్లల మానసిక సంరక్షణతో పాటు మద్దతు లేకపోవడంతో డిప్రెషన్కు ప్రధాన కారణాలన్నారు. ఇన్స్టిట్యూట్ పాలసీ రీసెర్చ్ డైరెక్టర్ ప్రీతీ మహారా మాట్లాడుతూ కొవిడ్ మహమ్మారి దుష్ప్రభావాలు పిల్లలపై ఇతర మార్గాల్లోనూ ఉంటాయన్నారు. చిన్నారులు తీవ్రంగా మనోవేధనకు గురయ్యారని, ఇది మనందరికీ అర్థం కాలేదన్నారు. ఇండ్లలోనే బందీలయ్యారని, ఇది చిన్నారి మనస్సుకు ప్రాణాంతకంగా మారిందన్నారు. మానసిక ఆరోగ్య నిపుణుడు ప్రకృతి పొద్దార్ మాట్లాడుతూ.. ప్రతిబిడ్డ తనదైన రీతిలో క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటాడని, ఆ సమయంలో తప్పనిసరిగా కౌన్సెలింగ్ అవసరమన్నారు.