నిజామాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే నిజాం షుగర్స్ ఫ్యాక్టరీకి ఈ గతి పట్టింది. రైతులంతా సహకార సంఘంగా ఏర్పడితే కేసీఆర్ హయాంలో పూర్తిస్థాయి మద్దతు ఇచ్చి ఫ్యాక్టరీని తెరిపించేందుకు ముందుకొచ్చాం.. కానీ నాడు ఇవే కాంగ్రెస్, బీజేపీలు రైతులను తప్పుదోవ పట్టించి అడ్డుకున్నయ్.
మహారాష్ట్ర తరహా రైతులకు మేలు చేసేందుకు కేసీఆర్ ఆలోచన చేశారు.’ అని నిజామాబాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ వివరించారు. ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు ఉంటేనే షుగర్ ఫ్యాక్టరీ, పసుపు బోర్డు కల సాకారమవుతుందని చెప్పారు.
ఎన్నికల ప్రచారం ఎలా కొనసాగుతున్నది?
లోక్సభ ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి అద్భుత స్పందన వస్తున్నది. బీఆర్ఎస్కు ప్రజల్లో ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. నిజామాబాద్ లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలతో వీలైనంత ఎక్కువ మందిని కలుస్తూ బీఆర్ఎస్ గెలుపు ఆవశ్యకతను వివరిస్తున్నాం. ప్రజలు కూడా బీఆర్ఎస్సే గెలవాలని కోరుకుంటున్నారు.
ఎక్కడికి వెళ్లినా కేసీఆర్ పరిపాలననే గుర్తుచేస్తున్నరు. కేసీఆర్ పాలనలో మానవీయత ఉండేది. అన్ని వర్గాలవారికి ఆ లోటు స్పష్టంగా తెలుస్తున్నది. బాల్కొండ, జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల్లో మా ఎమ్మెల్యేలే ఉన్నరు. ముఖ్య విషయం ఏమిటంటే అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఓట్లను పరిశీలిస్తే ఇతర పార్టీల కన్నా బీఆర్ఎస్కే ఎక్కువ వచ్చాయి.
ఎంపీ అర్వింద్ మళ్లీ పసుపుబోర్డు అంటున్నడు కదా?
ఇచ్చిన హామీని నెరవేర్చని దద్దమ్మ ధర్మపురి అర్వింద్. తాను గెలిస్తే ఐదు రోజుల్లోనే పసుపు బోర్డు తెస్తానని చెప్పి రైతులను మోసం చేసిండు. స్వయంగా ప్రధాని మోదీతో ప్రకటన చేయించి ఇప్పటికీ అతీగతీ లేదు. అందుకే పసుపు రైతులు అర్వింద్పై కోపంతో ఉన్నరు.
వారే బీజేపీని ఓడించబోతున్నరు. పసుపు బోర్డు ఎక్కడుందో చూపించే దమ్ముందా? ఇది మరో ఎన్నికల గిమ్మిక్కు మాత్రమే. కాంగ్రెస్ పార్టీ కూడా రైతులను నిలువునా దగా చేస్తున్నది. రైతుబంధును సక్రమంగా ఇవ్వలేదు. సాగునీటి కోసం రైతులను గోసపెట్టింది. వడ్లకు రూ.500 బోనస్ ఇస్తానని చెప్పి చేతులెత్తేసింది. ఇది రైతుల్లో రేవంత్ సర్కారుపై అసంతృప్తిని పెంచింది. ఈ ఎన్నికల్లో రైతులు బీఆర్ఎస్ వెంటే ఉంటరు.
చెరుకు ఫ్యాక్టరీపై కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదు
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలాంటి నాటకాలాడి ఓట్లు రాబట్టుకున్నదో అందరికీ తెలుసు. లోక్సభ ఎన్నికల్లోనూ అవే మాయమాటలు చెప్తున్నది. బోధన్ షుగర్ ఫ్యాక్టరీపై అబద్ధపు హామీలిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే కదా ఫ్యాక్టరీకి ఈ గతి పట్టింది. దాన్ని తెరిపించడంపై కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదు.
కేసీఆర్ హయాం లో రైతులంతా కలిసి సహకార సంఘంగా ఏర్పడితే పూర్తిస్థాయి మద్దతిచ్చి నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు ముందుకొచ్చాం. కానీ అప్పుడు ఇవే బీజేపీ, కాంగ్రెస్లు రైతులను తప్పుదోవ పట్టించి అడ్డుకున్నయ్. నిజాం షుగర్ ఫ్యాక్టరీతో నాకు విడదీయలేని బంధం ఉంది. 1996లో రైతులు నన్ను ఎన్ఎస్ఎఫ్కు అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఎంపీగా గెలిస్తే పార్లమెంట్లో గళమెత్తి చెరుకు రైతుల మేలు కోసం పాటుపడుతా. పసుపు బోర్డు అంశంపై కొట్లాడి నిజామాబాద్లోనే ఏర్పాటయ్యేలా కృషి చేస్తా.
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంపై మీకున్న పట్టు ఎలాంటిది?
నిజామాబాద్ లోక్సభ పరిధి నాకు కొట్టిన పిండి. ఈ ప్రాంత ప్రజలతో దశాబ్దంగా నాకు పరిచయాలున్నాయి. మరోవైపు జగిత్యాల జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాకు ఆత్మీయత, అనురాగాలు పంచే బంధుత్వాలున్నాయి. మా అమ్మమ్మ ఊరు జగిత్యాల జిల్లాలోనే ఉంది. నా బాల్యం అక్కడే గడిచింది. గతంలో బాన్సువాడ, ఆర్మూర్, మొన్నటి వరకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా సేవలందించా. బాన్సువాడ టెక్నికల్గా జహీరాబాద్ లోక్సభకు వెళ్లినా అందులోని కొన్ని గ్రామాలు నిజామాబాద్ లోక్సభ పరిధిలోకి వస్తాయి.
ఈ ప్రాంతంపై నాకు పట్టుంది. అంతకుమించి బీఆర్ఎస్ అనే బలమైన శక్తి నావెంట ఉంది. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్గుప్తా, ఆశన్నగారి జీవన్రెడ్డితోపాటు బోధన్లో షకీల్ సతీమణి ఆయేషా ఫాతిమా, జడ్పీ చైర్మన్ విఠల్ రావు, మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్, జగిత్యాల బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు నాకు సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. ఐక్యంగా ప్రచారంలో దూసుకుపోతున్నాం.
కాంగ్రెస్ పాలనపై ప్రజలేమంటున్నరు?
కాంగ్రెస్ మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని జనం తిడుతున్నరు. ఆరుగ్యారెంటీలను తుంగలో తొక్కి మోసంచేస్తున్న రేవంత్రెడ్డి తీరును ఎండగడుతున్నరు. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ, రైతుభరోసా కింద ఎకరానికి రూ.15వేలు, మహిళలకు రూ.2500, పింఛన్లు రూ.4వేలు ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఇవ్వకపోవడంపై ప్రజలు అసంతృప్తితో రగిలిపోతున్నరు.
మళ్లీ కేసీఆర్ వస్తేనే బాగుంటుందని ప్రజలంతా ముక్తకంఠంతో కోరుకుంటున్నరు. రేవంత్రెడ్డి సీఎం సీట్లో కూర్చొని ఫక్తు రాజకీయాలు చేయడం, బూతులు మాట్లాడటం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదు. కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచిన ఎమ్మెల్సీ జీవన్రెడ్డి పచ్చి అవకాశవాది. పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచి నాలుగున్నరేండ్లలో ఈ ప్రాంతానికి ఒక్కసారి కూడా తన ముఖం చూపించలేదు. అలాంటోడు ఎంపీగా నిలబడ్డాడు. ఈ ప్రాంతానికి పైసా కూడా వెచ్చించని వ్యక్తికి నిజామాబాద్వాసులు ఎందుకు ఓటెయ్యాలి?