PF Withdrawal New Rule | ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) తన సబ్ స్క్రైబర్ల కోసం కీలక నిర్ణయం తీసుకున్నది. పీఎఫ్ విత్ డ్రాయల్స్ కోసం అనుసరించాల్సిన నిబంధనలు మార్చేసింది. తాజాగా మార్చిన నిబంధనల వల్ల పీఎఫ్ లబ్ధిదారులకు మరింత లబ్ధి చేకూరుతుంది. తాజాగా మార్చిన నిబంధనల వల్ల ఈపీఎఫ్ఓ సబ్స్క్రైబర్లకు కలిగే ప్రయోజనం ఏమిటో తెలుసుకుందాం..
ఈపీఎఫ్ఓ సబ్ స్క్రైబర్లు మరణించినప్పుడు వారి ఖాతా నుంచి డబ్బులు విత్ డ్రా చేయడానికి ఆధార్ తప్పనిసరి. కొన్ని సందర్భాల్లో ఆధార్ లేకపోవడంతోపాటు తప్పులు దొర్లుతున్నాయి. దీనివల్ల ఈపీఎఫ్ ఖాతా నుంచి డబ్బు విత్ డ్రా చేయడం కష్టతరంగా మారింది. సకాలంలో డబ్బు అందక సంబంధిత వ్యక్తి కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకునే వారు.
దీంతో తమ సబ్స్క్రైబర్లు మరణిస్తే ఆధార్ కార్డు సమర్పించాల్సిన అవసరం లేకుండా సంబంధిత వ్యక్తి కుటుంబ సభ్యులు పీఎఫ్ విత్ డ్రా చేసుకునే సౌకర్యం ఈపీఎఫ్ఓ తీసుకొచ్చింది. మరణించిన ఉద్యోగి పని చేస్తున్న సంస్థలో హెచ్ఆర్ విభాగం.. తమ ఉద్యోగి మరణించారని నిర్ధారిస్తూ ఈపీఎఫ్ఓ వెబ్ సైట్లో వెల్లడించాలి. ఈ వివరాలు సరైనవేనని నిర్ధారించిన తర్వాత ఈపీఎఫ్ఓ కార్యాలయం ఆఫీసర్ ఇన్చార్జీ (ఓఐసీ) అనుమతి ఇస్తే.. సదరు వ్యక్తి పీఎఫ్ విత్ డ్రా ప్రక్రియ మొదలవుతుంది.
ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో సంబంధిత సబ్ స్క్రైబర్ యూఏఎన్లో ఆయన వివరాలు సరిగ్గా ఉన్నా.. ఆధార్ డేటా బేస్లో సమాచారం అసంపూర్ణంగా ఉన్నప్పుడే ఈ నిబంధన వర్తిస్తుందని ఈ నెల 17న జారీ చేసిన ప్రకటనలో ఈపీఎఫ్ఓ తెలిపింది. మరణించిన ఈపీఎఫ్ఓ ఖాతాదారుడికి ఆధార్ లేకపోయినా.. ఆ సబ్ స్క్రైబర్ నామినీ ఆధార్.. సిస్టమ్లో సేవ్ అవుతుంది. నామినీ సంతకం చేయడంతోపాటు జాయింట్ డిక్లరేషన్ ఫామ్ సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ నామినీ పేరు చేర్చకుంటే, సంబంధిత సభ్యుడి కుటుంబ వారసుల్లో ఒకరు జాయింట్ డిక్లరేషన్ ఫామ్ మీద అటెస్ట్ చేయించి.. ఇతర కుటుంబ సమ్మతితో పీఎఫ్ మనీ విత్ డ్రా కోసం క్లయిమ్ దాఖలు చేయొచ్చునని గత మార్చి 26న ఈపీఎఫ్ఓ వెల్లడించింది.