గుండాల, డిసెంబర్ 14: దేశ ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటన్నారని నల్లగొండ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన గుండాల మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభించడం హర్షణీయమని, పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ దేశానికి దిక్సూచి అని, దేశానికి కేసీఆర్ మోడల్ అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రైతాంగానికి పెద్దపీట వేసి ఎన్నో అద్భుతమైన పథకాలను అందజేస్తున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కోటి ఎకరాలకు సాగు నీరందిస్తున్నారని అన్నారు. రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్, మిషన్ కాకతీయ వంటి పథకాలతో రైతులను రాజును చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నారన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనకపోయినా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి ఆదుకుంటున్నదని పేర్కొన్నారు. ఈ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేసి నవ భారతదేశాన్ని నిర్మించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని చెప్పారు. దేశానికి భావి భారత ప్రధానిగా కేసీఆర్ కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. దేశంలో ఉన్న వనరులను ఉపయోగించకుండా ప్రధాని మోదీ దేశాన్ని అధోగతి పాలు చేస్తున్నారని అన్నారు.
రాష్ట్రపతి సొంత గ్రామంలో కరెంటు లేని పరిస్థితిని చూసి మోదీ పరిపాలన ఎలా ఉందో అర్థంం చేసుకోవచ్చని విమర్శించారు. బీజేపీని ఎదిరించి దేశ ప్రజలను అభివృద్ధి పథంలోకి తేవడానికే బీఆర్ఎస్ ఆవిర్భవించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి దయనీయంగా తయారైందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి వేలాదిగా బీఆర్ఎస్లో చేరుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని మండలంలోని మాసాన్పల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీకి దేశంలో, రాష్ట్రంలో భవిష్యత్ శూన్యమని ఆయన అన్నారు.
సమావేశంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఎండీ ఖలీల్, ప్రధాన కార్యదర్శి సంగి వేణుగోపాల్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మూగల శ్రీనివాస్, వైస్ ఎంపీపీ మహేందర్రెడ్డి, రైతు బంధు సమితి కన్వీనర్ గడ్డమీది పాండరి, జిల్లా నాయకులు కోలుకొండ రాములు, తాండ్ర శోభన్బాబు, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు డి.సైదులు, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు శ్రీశైలం, రంజిత్రెడ్డి, నాగరాజు, దయాకర్ పాల్గొన్నారు.