తెలంగాణపై భారతీయ జనతా పార్టీ ఎన్ని రకాల దాడులు చేసినా, ప్రజలు మాత్రం కేసీఆర్ వెంట నిలుస్తామని మునుగోడు ఫలితం ద్వారా ప్రకటించడం అద్భుతమన్నారు బేవరేజ్ కార్పోరేషన్ మాజీ చైర్మన్ దేవీ ప్రసాద్. తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి బీజేపీ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని ఆయన తెలిపారు. తెలంగాణలో మతతత్వ, విధ్వంసకర రాజకీయాలకుతావులేదని మునుగోడు ఓటర్లు స్పష్టంగా ప్రకటించడం తెలంగాణ ప్రజల చైతన్యంగా భావించాలని ఆయన స్పష్టం చేశారు. 22 వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టు తీసుకొని ఎన్నికల్లో పోటీ చేసిన బడా కాంట్రాక్టర్కి తగిన గుణపాఠం చెప్పడం తెలంగాణ ప్రజలకే సాధ్యమైందని అన్నారు దేవీ ప్రసాద్.
కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న అనేక సంక్షేమ పథకాలు దేశ ప్రజల మద్దతు పొందుతున్నాయని, భవిష్యత్తులో కేసీఆర్ నాయకత్వాన్ని దేశవ్యాప్తంగా విస్తరించడానికి మునుగోడు ఫలితం ఒక ప్రాతిపదికగా నిలుస్తుందని తెలియజేశారు. గుజరాత్ గులాములకు, తెలంగాణ ఆత్మగౌరవానికి జరిగిన పోరాటంలో మునుగోడు ప్రజలు కేసీఆర్ వెంట నిలబడడం చారిత్రక సందర్భమన్నారు దేవి ప్రసాద్. కేటీఆర్, హరీష్ రావు, పార్టీ నేతలంతా సమిష్టిగా కృషిచేసి తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని నిరూపించారని అన్నారు. మునుగోడు ఎన్నికల్లో టిఆర్ఎస్ వైపు నిలబడిన అన్ని వర్గాల ప్రజలకు అభినందనలు తెలిపారు దేవి ప్రసాద్.