ప్రజలకు అండగా నిలవాలి
ప్రత్యేక అధికారులతో కలిసి పనిచేయాలి
టీఆర్ఎస్ శ్రేణులకు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ సూచన
ములుగు, జూలై 12 (నమస్తే తెలంగాణ): జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ పిలుపునిచ్చారు. అమెరికాలో జరిగిన ఆటా మహాసభల్లో పాల్గొని తిరిగి వచ్చిన ఆయన్ను టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బాదం ప్రవీణ్ మంగళవారం కలిశారు. పూలమొక్కను అందించి స్వాగతం పలికారు. అనంతరం జడ్పీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. తొలుత ప్రభుత్వం కల్పించిన చెక్పవర్ను వినియోగించడంలో భాగంగా డిజిటల్ సైన్ ప్రక్రియను పూర్తి చేశారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధించడమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని, అందుకే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు సీఎం కేసీఆర్ చెక్పవర్ అవకాశాన్ని కల్పించారని తెలిపారు. దీంతో అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేసే అవకాశం ఏర్పడిందని తెలిపారు. అనంతరం టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నందున పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు ముంపు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు అండగా నిలవాలని సూచించారు. ప్రత్యేక అధికారులతో సమన్వయం చేసుకొని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని అన్నారు. అనంతరం జిల్లాకు విచ్చేసిన గిడ్డంగులశాఖ మాజీ చైర్మన్ మందల శామ్యూల్ను జడ్పీ చైర్మన్ సన్మానించారు. ఆత్మ చైర్మన్ రమణ, యువజన విభాగం నాయకుడు సాగర్, రవితేజ ఉన్నారు.