ఖలీల్వాడి, ఏప్రిల్ 23: అసెంబ్లీ ఎన్నికల ముందర ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయలేని సీఎం రేవంత్రెడ్డి.. లోక్సభ ఎలక్షన్లలో ఓట్ల కోసమే ఇప్పుడు రుణమాఫీ డ్రామా ఆడుతున్నాడని బీఆర్ఎస్ నిజామాబాద్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. మాజీ ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, బిగాల గణేశ్గుప్తాతో కలిసి నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో రెడ్హ్యాండెడ్గా రూ.50 లక్షలతో పట్టుబడిన దొంగ రేవంత్రెడ్డి చెప్పే మాటలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు. లక్ష్మినరసింహాస్వామి, సరస్వతి అమ్మవారి మీద ఒట్టేసి ఓట్లు అడుగుతున్న రేవంత్పై ఈసీ చర్యలు తీసుకోవాలని కోరారు.
గెలువగానే తొలి సంతకం రుణమాఫీపైనే అని చెప్పిన రేవంత్రెడ్డి.. ఎన్నికల కోసమే మళ్లీ రుణమాఫీ అంటున్నాడని విమర్శించారు. రైతులు ఆగమవుతుంటే పట్టించుకోవడం లేదన్నారు. జీవన్రెడ్డిని గెలిపిస్తే కేంద్ర మంత్రిని చేస్తా అంటుండు. అసలు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా? అని ప్రశ్నించారు. సీఎం తమ్ముళ్లే ఆయన బొమ్మ పెట్టుకోవడం లేదు. నీ కుటుంబం సక్కగా లేదు. నా కుమారుల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? అని నిలదీశారు. రేవంత్ అంత లత్కోర్ ఎవరూ లేరన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటల కరెంట్ ఇచ్చి రైతులను ఆదుకున్నాడని, కాంగ్రెస్ పాలనలో కరెంట్ ఎప్పుడు వస్తుందో, పోతుందో తెలియడం లేదన్నారు. బీజేపీని ఎదురిస్తే జైలులో పెడుతున్నారని, రేవంత్, మోదీ ఒక్కటై కవితను జైలులో పెట్టారని ఆరోపించారు. బ్లాక్మనీ తెచ్చి ప్రజలకు పంచుతామని మోదీ, పసుపుబోర్డు తెస్తానని అర్వింద్ ప్రజలను మోసం చేశారన్నారు. కేసీఆర్ను ఎందుకు కాదనుకున్నామని, కాంగ్రెస్కు ఎందుకు ఓటేశామని ప్రజలు బాధ పడుతున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు బ్రహ్మరథం పడతారని చెప్పారు.
ఎన్నికల ముందు రేవంత్రెడ్డి మరోమారు డ్రామాలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఎటు పోయాయని ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రేవంత్, రాహుల్గాంధీ టాక్స్ నడుస్తున్నదన్నారు. ఇప్పటికీ రైతుబంధు ఇవ్వలేదు. ఇక రుణమాఫీ ఎలా చేస్తారని ప్రశ్నించారు. కోరుట్లలో డాక్టర్ సంజయ్ చేతిలో ఓడిపోయిన అర్వింద్, జగిత్యాలలో సంజయ్ చేతిలో ఓడిన జీవన్రెడ్డి.. నిజామాబాద్లో బాజిరెడ్డి మీద ఎలా గెలుస్తారన్నారు. బాజిరెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.
దేవుళ్ల మీద ఒట్లు వేస్తున్న రేవంత్రెడ్డి ప్రజలను మరోసారి మోసం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అన్నారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని తేదీతో సహా ప్రకటించి మోసం చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ అబద్ధాలు నమ్మి ప్రజలు విలవిల్లాడుతున్నారని, మార్పు కోరుకున్న వారికి ఊహించని రీతిలో కాంగ్రెస్ ఇబ్బందుల్లోకి నెట్టిందన్నారు. కేసీఆర్ను కాదనుకున్న పాపానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఇప్పుడిప్పుడే మేల్కొంటున్నారని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించడం ఖాయమన్నారు. జీవన్రెడ్డిని కేంద్ర మంత్రి చేస్తానన్న రేవంత్రెడ్డి.. ఎమ్మెల్యే టికెట్ ఎవరికి ఇవ్వాలో అడిగేందుకు ఢిల్లీకి వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నదని. ఇక కేంద్ర మంత్రి పదవి ఇచ్చే దమ్ముందా? అని ప్రశ్నించారు. మేయర్ దండు నీతూకిరణ్, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, బీఆర్ఎస్ నగర అధ్యక్ష, కార్యదర్శులు సిర్ప రాజు, ఎనుగందుల మురళి, సీనియర్ నాయకులు సుజిత్సింగ్ ఠాకూర్, సత్యప్రకాశ్ పాల్గొన్నారు.