న్యూఢిల్లీ, జనవరి 30: 2017లోనే కేంద్ర ప్రభుత్వం ఇజ్రాయెల్ నుంచి పెగాసస్ స్పైవేర్ను కొనుగోలు చేసిందని పేర్కొంటూ న్యూయార్క్ టైమ్స్ వెలువరించిన కథనం దేశ రాజకీయాల్లో మరోమారు ప్రకంపలు సృష్టిస్తున్నది. తాజాగా పెగాసస్ అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై వరుస ట్వీట్ల ద్వారా విమర్శలు ఎక్కుపెట్టారు. 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి కేంద్రం రెట్టింపు డబ్బు చెల్లించి మరీ మరికొన్ని అధునాతన స్పైవేర్లు తీసుకొస్తుందని ఆరోపించారు. ‘ఇజ్రాయెల్తో మునుపటి ఒప్పందం 2 బిలియన్ డాలర్ల వరకు జరిగింది. ఈసారి కేంద్రం అంతకంటే మెరుగ్గా చెల్లించే అవకాశం ఉంది. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అధునాతన స్పైవేర్లు కొనుగోలు చేసేందుకు 4 బిలియన్ డాలర్లు కూడా చెల్లించగలదు’ అని అన్నారు. మరోవైపు న్యూయార్క్టైమ్స్ కథనం నేపథ్యంలో పెగాసస్ అంశంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. పెగాసస్ డీల్పై దర్యాప్తు చేయడంతో పాటు సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేయాలని న్యాయవాది ఎంఎల్శర్మ కోర్టును కోరారు. న్యూయా ర్క్ టైమ్స్ తాజా కథనాన్ని పరిగణనలోకి తీసుకోవాలని పెగాసస్ అంశంపై సుప్రీంకోర్టు నియమించిన ప్యానెల్ను ఎడిటర్స్ గిల్డ్ లేఖ ద్వారా కోరింది.
ఐటీ మంత్రిపై ప్రివిలేజ్ మోషన్ తేవాలి: కాంగ్రెస్
పెగాసస్పై పార్లమెంట్ను తప్పుదోవ పట్టించిన కేంద్ర ఐటీ మంత్రిపై ప్రివిలేజ్ మోషన్ తీసుకురావాలని లోక్సభ కాంగ్రెస్పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి స్పీకర్ ఓంబిర్లాను కోరారు. న్యూయార్క్ టైమ్స్ కథనం నేపథ్యంలో ఆయన స్పీకర్కు లేఖ రాశారు. పెగాసస్తో తమకు సంబంధం లేదని, ఎన్ఎస్వో గ్రూపు నుంచి తాము కొనుగోలు చేయలేదని మోదీ సర్కారు సభలో చెప్పుకొంటూ వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. పెగాసస్ కొనుగోలు, వినియోగం గురించి సుప్రీంకోర్టు నేరుగా ప్రశ్నించినప్పుడు కూడా కేంద్రం అబద్ధం చెప్పిందని, అఫిడవిట్లో కూడా ఆరోపణలను ఖండించిందని పేర్కొన్నారు.