న్యూఢిల్లీ: ప్రస్తుతం వెంటాడుతున్న ఎల్నినో(2026) ఆధునిక చరిత్రలో అత్యంత శక్తివంతమైనదిగా మారుతున్నదని శాస్త్రవేత్తలు భావిస్తున్న తరుణంలో, దీని కారణంగా తలెత్తే ఆర్థిక ప్రభావం మరింత ఆందోళనకరంగా కనిపిస్తున్నది. గతంలో రికార్డు సృష్టించిన ఎల్ నినో సంఘటనల వల్ల జరిగిన ఆర్థిక నష్టాల కంటే మరింత తీవ్రమైన నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వీటిలో అత్యంత విధ్వంసకరమైన 1997-98 ఘటన.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుంచి అంచనా వేయబడిన 5.7 ట్రిలియన్ల డాలర్లను తుడిచిపెట్టింది. ఎల్ నినో కేవలం తాత్కాలిక వాతావరణ అంతరాయాలను మాత్రమే కలిగించిందని, వాతావరణ దృగ్విషయం ముగిసిన తర్వాత కూడా సంవత్సరాల తరబడి ఆర్థిక వృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆ అధ్యయనం కనుగొంది. ఉష్ణమండల ఉష్ణోగ్రతలు ఇప్పటికే ‘సూపర్ ఎల్ నినో’ పరిమితులను చేరుకున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.
రాబోయే నెలల్లో రికార్డు స్థాయిలో ఉపరితల ఉష్ణోగ్రత వెలువడే అవకాశం ఉంది. ఇది 2026 డిసెంబర్ నాటికి గరిష్ఠ స్థాయికి చేరుకోవచ్చని, 2027 వరకు కూడా వాతావరణ నమూనాలను ప్రభావితం చేయవచ్చని అంచనాలు సూచిస్తున్నాయి. 21వ శతాబ్దంలో 84 ట్రిలియన్ డాలర్ల సంచిత ప్రపంచ ఆర్థిక నష్టాలు సంభవించవచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. భారతదేశంలో వేగంగా పారిశ్రామికీకరణ జరుగుతున్నప్పటికీ, వ్యవసాయం ఇప్పటికీ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన స్తంభంగా ఉంది. 2026 రుతుపవనాలు ఇప్పటికే దీర్ఘకాలిక వర్షాభావ, అసమాన వర్షపాత పంపిణీతో అనిశ్చిత ప్రవర్తనను ప్రదర్శించాయి. ఇది పలు వ్యవసాయ ప్రాంతాలను ప్రభావితం చేసింది. బలమైన ఎల్ నినో కరువు ముప్పును తీవ్రతరం చేస్తుంది. పంట దిగుబడిని తగ్గిస్తుంది. ఆహార ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది. నీటి వనరులపై ఒత్తిడి తెస్తుంది. వ్యవసాయంతో పాటు ఇంధనం, తయారీ నుంచి రవాణా వరకు ప్రతి రంగం తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది.