రాంచి : విద్యార్థుల 24 రోజుల నిరసనలకు ఎట్టకేలకు జార్ఖండ్ ప్రభుత్వం దిగొచ్చింది. సోమవారం నిరసనకారులు, ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చలు విజయం సాధించాయని సీఎం హేమంత్ సోరెన్ తెలిపారు. విద్యార్థుల డిమాండ్లలో కొన్నింటిని ఇప్పటికే అంగీకరించామని.. తాజాగా కఠిన నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. జేపీఎస్సీ నియామక పరీక్షతో పాటు జేఎస్ఎస్సీ-సీజీఎల్ పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. 2014 నుంచి టీడీపీఎల్ సంస్థ నిర్వహించిన అన్ని పరీక్షలపై సీఐడీతో విచారణ జరిపిస్తామన్నారు. అలాగే టీడీపీఎల్ ప్రకటించిన అన్ని ఫలితాలను కూడా రద్దు చేస్తున్నట్టు హేమంత్ సోరెన్ స్పష్టం చేశారు. రిటైర్డ్ జడ్జితో కూడిన కమిటీ పరీక్షల్లో అవకతవకలపై ప్రత్యేక విచారణ జరుపుతుందని హామీ ఇచ్చారు.
పరీక్షల్లో సంస్కరణలు..
సీఎం హేమంత్ సోరెన్ మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం తీసుకొచ్చిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను పాటించకపోవడం వల్లే అవకతవకలు జరిగాయి. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించడానికి అమితాబ్ కౌశల్ నాయకత్వంలో సంస్కరణలు చేపడుతాం. విద్యార్థుల ఫిర్యాదుల కోసం ప్రత్యేక పోర్టల్ను ఏర్పాటు చేస్తాం. అక్కడ ఉండే నిపుణుల బృందం వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటుంది.కేంద్ర ప్రభుత్వం ఎంఎండీఆర్ చట్టంలో చేసిన మార్పులపై కూడా పరిశీలిస్తున్నాం. అవసరం అయితే వీటన్నింటిపై చర్చించేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తాం. ఇప్పటికే సీఐడీ విచారణలో భాగంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో కొందరి అరెస్టులు జరిగాయి. మిగిలిన వారిని గుర్తిస్తున్నాం. తప్పు చేసిన వారిని వదిలిపెట్టేది లేదు’ అని సీఎం హేమంత్ సోరెన్ వెల్లడించారు.