Mohamed Muizzu: భారత్తో వివాదాలకు ఆజ్యం పోస్తూ చైనాకు దగ్గరవుతున్న మాల్దీవుల (Maldives) అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్జు (Mohamed Muizzu) మరోసారి తన నోటి దరుసు ప్రదర్శించారు. న్యూఢిల్లీపై మళ్లీ వ్యతిరేక గళం వినిపించారు. మే నెల 10వ తేదీ తర్వాత భారత్కు చెందిన మిలిటరీ సిబ్బంది (Indian troops) ఒక్కరు కూడా తమ భూభాగంలో ఉండకూదని ఆర్డర్ వేశారు.
ఆఖరికి సివిల్ డ్రెస్సుల్లో కూడా భారత మిలిటరీ సిబ్బంది ఇక్కడ సంచరించడానికి వీల్లేదంటూ మొయిజ్జు నోరు పారేసుకున్నారు. సైనిక సహకారంపై చైనాతో కీలక ఒప్పందం కుదుర్చుకున్న గంటల వ్యవధిలోనే మాల్దీవ్స్ అధ్యక్షుడు తన స్వరానికి పదును పెట్టడం గమనార్హం. కాగా, మొయిజ్జు అధికారంలోకి వచ్చిన తర్వాత మాల్దీవ్స్, భారత్ దేశాల మధ్య దూరం పెరిగింది.
ఈ క్రమంలోనే మాల్దీవ్స్లోని మూడు వైమానిక స్థావరాల్లో విధులు నిర్వహిస్తున్న భారత బలగాలు వెనక్కి వెళ్లిపోవాలని గతంలోనే మొయిజ్జు ఆదేశించారు. ఒక వైమానిక స్థావరంలోని బలగాలు మార్చి 10లోగా, మిగతా రెండు స్థావరాల్లోని దళాలు మే 10 నాటికి వెనక్కి వెళ్లిపోవాలని ఆర్డర్ వేశారు. దానిపై ఫిబ్రవరి 2న ఢిల్లీ వేదికగా ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.
వెనక్కి తీసుకునే తమ బలగాల స్థానంలో సమర్థులైన సాంకేతిక సిబ్బంది (Technical Personnel) ని నియమిస్తామని అప్పుడు ఢిల్లీ పెట్టిన షరతును మాల్దీవ్స్ అంగీకరించింది. దాంతో గత వారమే భారత సాంకేతిక బృందం ఆ దీవులకు చేరుకుంది. అయితే, దీనిపై మాల్దీవువ్స్లోని కొన్ని విపక్ష పార్టీలు కొత్త వాదనను తెరపైకి తెచ్చాయి.
సాంకేతిక సిబ్బంది వాస్తవానికి మిలిటరీ అధికారులేనని, పౌర దుస్తుల్లో వారిని పంపిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశాయి. దీనిపై తాజాగా ముయిజ్జు స్పందిస్తూ.. ‘భారత బలగాల ఉపసంహరణలో మా ప్రభుత్వం విజయం సాధించింది. ఇది చూసి తట్టుకోలేని విపక్షాలు కొత్త ట్విస్ట్లు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. అలాంటి అనుమానాలేం పెట్టుకోవద్దు. మే 10 తర్వాత భారత బలగాలు దేశంలో ఉండవు. కనీసం సివిల్ దుస్తుల్లోనూ వారిని ఉండనివ్వం’ అని ప్రకటించారు.
కాగా, మాల్దీవుల్లోని మూడు వైమానిక స్థావరాల్లో 88 మంది భారత మిలిటరీ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు స్థానిక ప్రజలకు మానవతా సాయం, అత్యవసర పరిస్థితుల్లో వైద్యం కోసం తరలింపు వంటి సేవలను అందిస్తున్నారు. అయితే, ఢిల్లీని దూరం పెడుతున్న మొయిజ్జు ఈ సేవల కోసం గతవారం శ్రీలంకతో ఒప్పందం చేసుకున్నారు. భవిష్యత్తులో అన్ని కేటగిరీల నుంచి భారత సిబ్బందిని వెనక్కి పంపించే సూచనలు కన్పిస్తున్నాయి.
ఇక చైనాకు అనుకూల నేతగా పేరున్న మొయిజ్జు ఊహించినట్లుగానే డ్రాగన్కు దగ్గరవుతున్నారు. తాజాగా ఈ రెండు దేశాల మధ్య సైనిక సహకారంపై ఒప్పందం జరిగింది. మాల్దీవులకు ఉచితంగా సైనిక పరికరాలను అందించేందుకు చైనా ముందుకు వచ్చింది.