హైదరాబాద్, జనవరి 24 : తెలంగాణ కొంగు బంగారం సింగరేణి సంస్థను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేయడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం కుట్రలు చేస్తున్నదని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. బీజేపీ ప్రయత్నాలను సాగనివ్వబోమని, కార్మికులతో కలిసి బొగ్గు బావుల నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఇందుకు కార్మిక సంఘాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. సింగరేణిని ప్రైవేటీకరించవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే 2015లో, 2021లో ప్రధాని మోదీకి లేఖ రాశారని గుర్తుచేశారు. సోమవారం ఆయన తెలంగాణభవన్లో విప్ బాల్క సుమన్, ఎంపీ వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్యేలు గండ్ర వెంకట రమణారెడ్డి, కోరుకంటి చందర్, సండ్ర వెంకటవీరయ్య, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుతో కలిసి మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం సింగ రేణికి కొత్త బ్లాకులు ఇవ్వకపోగా ఉన్న బ్లాకులను ప్రైవేట్వారికి అప్పగిస్తున్నదని మంత్రి కొప్పుల విమర్శించారు. కేంద్రం దుర్మార్గంగా, అమానుషంగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర నిర్ణయం తెలంగాణకు గొడ్డలిపెట్టు అని ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా కార్మికులు ఇప్పటికే మూడ్రోజులు సమ్మె చేశారని, రాబోయే రోజుల్లో ఆందోళనలు కొనసాగిస్తామని చెప్పారు. సింగరేణి కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలుచేస్తున్నదని వివరించారు. కార్మికులు చనిపోతే ఇచ్చే ఎక్స్గ్రేషియాను రూ.2 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచినట్టు పేర్కొన్నారు. కార్మికుడి సొంతిటి కలను నేరవేర్చేందుకు రూ.10 లక్షలను వడ్డీ లేని రుణంగా ఇస్తున్నట్టు చెప్పారు. సంస్థను కాపాడుకోవడానికి ప్రతి కార్మికుడు పోరాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సింగరేణి సంస్థ సాధించిన విజయాలను, పురోగతిని గణాంకాలతో వివరించారు.
బీజేపీ నేతలను నిలదీయాలి: బాల్క సుమన్
సింగరేణిని కాపాడుకోవడానికి ఎంతటి పోరాటానికైనా టీఆర్ఎస్ సిద్ధమని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ చెప్పారు. కార్మికులు కూడా ఐక్యంగా కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ దోస్తులకు సింగరేణిని అప్పగించడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ ఎంపీలు ఎందుకు మౌనంగా ఉన్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులను బట్టలూడదీసి కొట్టాలని, ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు. సింగరేణిని ప్రైవేట్పరం చేస్తే వారసత్వ ఉద్యోగాలు ఇవ్వరని, సీఎస్సార్, డీఎండీఎఫ్ నిధుల ద్వారా అభివృద్ధి పనులకు అస్కారం ఉండదని చెప్పారు. సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణను అన్ని సంఘాలు వ్యతిరేకించినా కేంద్రం పెడచెవిన పెట్టిందని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. సింగరేణిపై కేంద్రం కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. బీజేపీ వైఖరిని ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఖండించాలని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వకపోగా సింగరేణిని నిర్వీర్యం చేయాలని చూస్తున్నదని విమర్శించారు.