న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: ఇప్పటికే క్యాబినెట్ ఆమోదం పొందిన ప్రభుత్వ రంగ సంస్థలను (పీఎస్యూలు) వేగంగా మూసివేసి, అమ్మేయాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం తన మంత్రిత్వ శాఖల్ని ఆదేశించింది. నష్టాల్లో ఉన్న, ఖాయిలాపడిన పీఎస్యూల మూసివేతపై కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా ఇటీవల ఒక సమీక్షా సమావేశం జరిపారు.
అటువంటి పీఎస్యూల మూసివేతలో జరుగుతున్న జాప్యానికి కారణాలు తెలియచేయాలంటూ వివిధ మంత్రిత్వ శాఖల అధికారులను ఆయన ఆదేశించినట్టు సంబంధిత వర్గాల ద్వారా వెల్లడయ్యింది. వాటిని నడపడం ద్వారా ప్రభుత్వ వనరులు వృధా కారాదని, క్యాబినెట్ అనుమతి పొందిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ఆటానమస్ సంస్థలు, ఇతర సంస్థల్ని తక్షణం మూసివేయాలని ఆదేశించినట్టు పేరు తెలపడానికి ఇష్టపడని సీనియర్ ప్రభుత్వ అధికారు తెలిపారు.
వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ప్రచారం ప్రారంభించిన‘విజన్ ఇండియా @ 2047’కు రోడ్మ్యాప్పై చర్చించడానికి రాజీవ్ గౌబా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచంలో మూడు పెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలోకి భారత్ను చేర్చేదిశగా ఈ విజన్ ఇండియా ప్రణాళికను రూపొందించారు. కంప్ట్రొలర్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మెజారిటీ వాటా కలిగిన 607 పీఎస్యూలు ఉన్నాయి. ఇందులో 488 ప్రభుత్వ కంపెనీలు కాగా, 6 చట్టబద్దమైన కార్పొరేషన్లు, 203 ప్రభుత్వ నియంత్రణలోని ఇతర కంపెనీలు ఉన్నాయి.
2019-20 ఆర్థిక సంవత్సరంలో 181 ప్రభుత్వ రంగ సంస్థలు రూ. 68,434 కోట్ల నికరనష్టాలను చవిచూసినట్టు కాగ్ 2021 డిసెంబర్లో విడుదల చేసిన నివేదిక తెలిపింది. అంతక్రితం ఏడాది ఈ నష్టాలు రూ.40,835 కోట్లు. వీటిలో 115 కంపెనీలైతే గత మూడేండ్లుగా, 64 సంస్థలు ఐదేండ్లుగా నష్టాల్లో ఉన్నాయి. బీఎస్ఎన్ఎల్, ఎయిర్ ఇండియాలతో సహా 14 కంపెనీలు 2019-20లో రూ. 1000 కోట్లకుపైగా నష్టాల్ని తెచ్చుకున్నాయి.
ఇందులో ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్నకు కేంద్రం విక్రయించిన సంగతి తెలిసిందే. 2022-23 ఆర్థిక సంవత్సరంలో పీఎస్యూల ప్రైవేటీకరణ ద్వారా రూ. 65,000 కోట్లు సమీకరించాలని కేంద్రం బడ్జెట్లో నిర్దేశించుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ ఓఎన్జీసీ, ఎల్ఐసీ, పరదీప్ పాస్ఫేట్స్ల్లో వాటాలను విక్రయించి ప్రభుత్వం రూ.24,544 కోట్లు సమీకరించింది. ఈ మొత్తంలో 90 శాతం నిధులు ఎల్ఐసీ లిస్టింగ్ ద్వారా సమకూరినవే.