వ్యవసాయాధికారులు విస్త్రృతంగా అవగాహన కల్పించాలి
యాసంగిలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయదు
మంజీరా నది, హల్దీవాగుపై నిర్మిస్తున్న చెక్ డ్యాంలను త్వరగా పూర్తి చేయాలి
కాళేశ్వరం కాలువ నిర్మాణానికి భూసేకరణ వేగవంతం చేయాలి
సాగునీటి సలహా సంఘం సమావేశంలో ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి
మెదక్, డిసెంబర్ 28 : కేంద్ర ప్రభుత్వం యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయబోమని తేల్చి చెప్పినందున వరికి బదులు ఇతర పంటలు వేసేలా రైతులను ప్రోత్సహించాలని సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్తో కలిసి కలెక్టర్ చాంబర్లో ఏర్పాటు చేసిన సాగునీటి సలహా సంఘం సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంజినీరింగ్ అధికారులు, సభ్యులనుద్దేశించి మాట్లాడుతూ యాసంగి పంటను ఎఫ్సీఐ కొనుగోలు చేయదు కాబట్టి ఇతర పంటలైన కందులు, మినుములు, పెసర్లు, వేరుశనగ, ఆయిల్ సీడ్స్, పత్తి, నువ్వులు వంటి పంటలు వేసేలా ప్రోత్సహించాలని పేర్కొన్నారు.
ఒక వేళ రైతులు అవసరాల మేరకు లేదా విత్తన డీలర్ల హామీ మేరకు ధాన్యం పండించుకుంటే అభ్యంతరం లేదని, ప్రభుత్వం మాత్రం యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయబోదని స్పష్టం చేశారు. కాగా, యాసంగిలో అవసరం మేరకు సింగూరు నుంచి సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నీటి పారుదల శాఖ కింద ఉన్న 27,675 ఎకరాల ఆయకట్టు పరిధిలోని రైతుల్లో మార్పు వచ్చేలా పక్కా కార్యాచరణ, ప్రణాళికతో అవగాహన కల్పించాల్సిందిగా ఇంజినీరింగ్, వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. పంటలను కాపాడేందుకు ఉద్యాన శాఖ ద్వారా సబ్సిడీపై సోలార్ ఫెన్సింగ్ను ఏర్పాటు చేసుకునే ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయన్నారు. భూగర్భ జలాల పెంపునకు శాశ్వత ప్రాతిపదికన మంజీరా నది, హల్ధీవాగుపై నిర్మిస్తున్న చెక్ డ్యాంలను త్వరితగతిన పూర్తి చేసేందుకు ఈ యాసంగి మంచి అవకాశమని, శ్రామికులు, యంత్రాలను అధికంగా పెట్టి పనులను వేగంగా చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. అంతకుముందు కాళేశ్వరం కాలువ నిర్మాణానికి భూ సేకరణ పూర్తి చేయాలని ఆర్డీవోలను ఆదేశించారు. సమావేశంలో నీటి పారుదల శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ ఏసయ్య, ఈఈలు శ్రీనివాస్రావు, కీమానాయక్, మెదక్, తూప్రాన్ ఆర్డీవోలు సాయిరాం, శ్యాంప్రకాశ్, సాగునీటి సలహా సంఘం సభ్యులు కొంపల్లి సుభాష్రెడ్డి, నర్సింహారెడ్డి, రామకిషన్, డీఈఈలు శివనాగరాజు, జగన్నాథం, శ్రీధర్, శ్రీకాంత్, ఏఈఈలు విజయ్కుమార్, శ్రీహరిగౌడ్, అనురాధ, టింకు తదితరులు పాల్గొన్నారు.