MLC Kavitha | హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): గంటా.. రెండు గంటలు కాదు. ఏకధాటిగా పదిన్నర గంటలపాటు ఈడీ విచారణను ఎదుర్కొన్నా ఎక్కడా తన స్థైర్యాన్ని కోల్పోలేదు. బయట అనేక ఊహాగానాలు.. ఇండియా- పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ను తలదన్నేలా ఎలక్ట్రానిక్ మీడియా.. సామాజిక మాధ్యమాలు సృష్టించిన హడావుడి.. ఆ ప్రచారాలను పటాపంచలు చేస్తూ ఎమ్మెల్సీ కవిత విజయదరహాసంతో బయటకు వచ్చారు. ఇదీ సోమవారం ఢిల్లీ ఏపీజే అబ్దుల్ కలామ్ రోడ్లో నెలకొన్న దృశ్యం. ఢిల్లీ మద్యం విధానం కేసుకు సంబంధించి సోమవారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రెండోసారి ఈడీ కార్యాలయానికి చేరుకొన్నారు. ఉదయం 10.25 గంటలకు ఈడీ కార్యాలయంలోకి అడుగుపెట్టిన ఆమె తిరిగి రాత్రి 9.10 గంటలకు బయటకు వచ్చారు. ఈడీ కార్యాలయం లోపలికి వెళ్లేప్పుడు ఆమెలో ఉన్న ఆత్మవిశ్వాసం బయటికి వచ్చేప్పుడు మరింత ప్రకాశవంతంగా కనిపించింది. అందరికీ అభివాదం చేస్తూ విజయచిహ్నాన్ని చూపుతూ, చిరునవ్వుతో కారు ఎక్కారు. చినుకులు పడుతున్నా ఆమె అభిమానులు, భారత జాగృతి నాయకులు, కార్యకర్తలు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఆమె కారు ముందు గుమ్మడికాయతో దిష్టి తీశారు. అక్కడి నుంచి ఢిల్లీలోని సీఎం కేసీఆర్ అధికారిక నివాసానికి చేరుకొన్నారు. ఏపీజే అబ్దుల్ కలాం రోడ్ నుంచి సీఎం కేసీఆర్ నివాసానికి చేరుకొనే వరకు ఆమె కాన్వాయ్ను అనుసరిస్తూ కార్యకర్తలు కదిలారు.
ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించి కవితను సోమవారం విచారణకు రావాల్సిందిగా ఈడీ కోరింది. ఢిల్లీలోని సీఎం కేసీఆర్ అధికారిక నివాసం నుంచి భర్త అనిల్తో కలిసి కవిత ఈడీ కార్యాలయానికి బయలు దేరారు. సరిగ్గా 10.25 గంటలకు ఆమె భర్త అనిల్ ఆమెకు బెస్ట్ విషెస్ చెప్పారు. అప్పటి నుంచి రాత్రి ఆమె కార్యాలయం నుంచి బయటికి వచ్చేదాకా అనేక ఊహాగానాలు ప్రచారం అయ్యాయి. ఎలక్ట్రానిక్ మీడియా లైవ్ కవరేజ్తో పోటీపడి సామాజిక మాధ్యమాల్లో అనేక కోణాల్లో.. అనేక అనుమానాలను రేకెత్తిస్తూ ప్రచారం జరిగింది. మధ్యలో ఎమ్మెల్సీ కవిత తరపు న్యాయవాదులు ఈడీ కార్యాలయానికి చేరుకోవడం, సాయంత్రం కొంతమంది వైద్యులు అక్కడికి రావడం అనేక ఊహాగానాలకు తావిచ్చింది. విచారణ అనంతరం ఆమె బయటికి రావడంతో అవన్నీ పటాపంచలు అయ్యాయి. పదిన్నర గంటలపాటు విచారణను ఎదుర్కొన్నా మొక్కవోని పట్టుదలతో.. చెరగని చిరునవ్వుతో కవిత తన అభిమానులకు విజయసంకేతాన్ని చూపుతూ తన కోసం వేచి ఉన్నవారందరికీ అభివాదం చేస్తూ ఇంటికి చేరుకొన్నారు.
విచారణ అనంతరం ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవితను తిరిగి మంగళవారం విచారణకు హాజరుకావాలని సూచించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి కవిత ఈ నెల 11న తొలిసారి ఢిల్లీలో ఈడీ విచారణకు హాజరు అయ్యారు. ఆమెను తిరిగి ఈ నెల 16న మరోసారి రావాలని ఈడీ ఆదేశించింది. ఈడీ నోటీసులకు సంబంధించి తాను సుప్రీం కోర్టులో పిటిషన్ వేశానని, అది ఈ నెల 24న విచారణకు రానున్నదని, సుప్రీం తీర్పునకు అనుగుణంగా నడుచుకుంటానని ఆమె ఈడీకి తన ప్రతినిధి ద్వారా చెప్పారు. అదే సమయంలో ఈడీ అడిగిన అన్ని పత్రాలను సమర్పించారు. అనంతరం సోమవారం ఆమెను విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులివ్వడంతో హాజరయ్యారు.