నల్లగొండ: శాసనసభ సమావేశాలపై బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తున్నదని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukhender reddy) ఆగ్రహం వ్యక్తంచేశారు. సమావేశాలకు గవర్నర్ను పిలవాలని చెబుతున్న బీజేపీ నాయకులు.. శాసనసభ ప్రొరోగ్ గురించి తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. నల్లగొండలోని తన నివాసంలో జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ కుటిల యత్నాలు తిప్పికొడతామన్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ అవగాహనా లేమితో మాట్లాడుతున్నారని విమర్శించారు.
తమిళనాడులో బీజేపీకి ఘోర పరాభవం జరిగిందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఆపార్టీ దేశంలో నికృష్ట విధానాలను అమలు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో కేంద్రానికి ముందస్తు ఆలోచన లేదని విమర్శించారు. ఉత్తరప్రదేశ్లో అధికార దాహం తప్ప వేరే ఆలోచన లేదన్నారు.
ప్రశాంత్ కిషోర్ దేశవ్యాప్తంగా రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించారని చెప్పారు. తెలంగాణలో పీకే వ్యూహాలపై జంకు ఎందుకని ఆయన ప్రశ్నించారు. పలు సందర్భాల్లో ఉమ్మడి శాసనసభకు గవర్నర్ను పిలువకుండానే సమావేశాలు నిర్వహించారని గుర్తుచేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులనే రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకుంటుందని చెప్పారు.
గవర్నర్ వ్యవస్థను కాంగ్రెస్, బీజేపీలు నిర్వీర్యం చేశాయని, గవర్నర్ పాత్రను రాజకీయంగా పరిమితం చేశాయని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతికత వారికి లేదన్నారు. రాష్ట్రంలో సుభిక్షమైన, సుస్థిర పరిపాలన కొనసాగితుందని చెప్పారు. ఉభయ జాతీయ పార్టీలు దేశ అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. పార్టీ పరంగా ఎవరి సేవలు ఉపయోగించుకోవలనేది టీఆర్ఎస్ వ్యక్తిగత అంశమన్నారు.