మైలార్దేవ్పల్లి, డిసెంబర్ 29: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలకు అర్హులైన ప్రజలంతా తమ దరఖాస్తులు అందించి లబ్ధిపొందాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్గౌడ్ తెలిపారు. మైలార్దేవ్పల్లి డివిజన్ టీఎన్జీవోస్ కాలనీలోని వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన సెంటర్ను శుక్రవారం ఆయన సందర్శించారు. అధికారులతో కలిసి ప్రజల దరఖాస్తులను స్వీకరించి అందజేశారు. అలాగే ప్రజలతో ఆయన మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. ప్రజలెవరికీ సమస్యలు తలెత్తకుండా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే టి.ప్రకాశ్గౌడ్ మాట్లాడుతూ.. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో తాను రాజకీయాలకు అతీతంగా ప్రజా సేవ చేస్తానన్నారు.
అర్హులందరూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తాను పాటుపడుతానన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతి పథకం నిరుపేదలకు, అర్హులకు అందేలా చూస్తానన్నారు. ప్రభుత్వం సూచించిన విధంగా ప్రజలు తమతమ వార్డుల్లో ఏర్పాటు చేసిన ప్రజా పాలన సెంటర్లకు వచ్చి దరఖాస్తులను అందించాలన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి, అభివృద్ధికి తాను ఎల్లప్పుడు ముందుంటానన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చిన తన వద్దకు నేరుగా వచ్చి ఫిర్యాదులు చేయాలన్నారు. అప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ సర్కిల్ ఉపకమిషనర్ రవికిరణ్, బీఆర్ఎస్ మైలార్దేవ్పల్లి డివిజన్ అధ్యక్షులు టి.ప్రేమ్గౌడ్, కాశీగారి యాదగిరి, గుమ్మడి కుమార్, కొండల్ముదిరాజ్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మణికొండ, డిసెంబర్ 29: తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీల అమలులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో శుక్రవారం కోకాపేట కమ్యూనిటీ హాల్లో జరుగుతున్న అభయహస్తం కార్యక్రమాన్ని రాష్ట్ర మున్సిపల్శాఖ అదనపు డైరెక్టర్ జాన్ శాంసన్, జాయింట్ డైరెక్టర్ కృష్ణమోహన్రెడ్డి సంయుక్తంగా పరిశీలించారు. సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారంటీల పథకంపై ప్రజల్లో పూర్తిస్థాయి అవగాహన కల్పించేందుకు సంస్థాగత అధికారులు చొరవ చూపాలని కోరారు. దరఖాస్తుదారులకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తూ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దరఖాస్తు పారాలను లబ్ధిదారులు కోరిన విధంగా నింపాలని సూచించారు. నిజమైన లబ్ధిదారులకు సర్కారు పథకాలు అందేవిధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నార్సింగి మున్సిపల్ కమిషనర్ సురేందర్రెడ్డి, డీఈ నర్సింహ రాజు, ఏఈ శ్రీనివాస్, మేనేజర్ యోగేశ్నాయక్, ఆర్ఐలు మోహన్రావు, అఖిల్, మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు.
శంషాబాద్ రూరల్, డిసెంబర్ 29: ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వం లక్ష్యమని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. మండలంలోని 27 గ్రామ పంచాయతీలతో పాటు శంషాబాద్ మున్సిపాలిటీలోని 25 వార్డుల్లో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆయా గ్రామాల సర్పంచ్లు, అధికారులు పాల్గొన్నారు.
మణికొండ, డిసెంబర్ 29: తెలంగాణ ప్రభుత్వం మొదటిసారిగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అభయహస్తం ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రెండోరోజు గండిపేట మండల పరిధిలోని మణికొండ, నార్సింగి మున్సిపాలిటీల్లో ఆరు గ్యారంటీల దరఖాస్తు సేకరణ కార్యక్రమం ఆయా వార్డు కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో కొనసాగుతుంది. ఈ సందర్భంగా మణికొండ మున్సిపల్ చైర్మన్ కస్తూరి నరేందర్ మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ప్రజలంతా సర్కారు ప్రవేశపెట్టన సంక్షేమ ఫలాలను పొందేందుకు దరఖాస్తులు విధిగా చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ పథకానికి నిజమైన అర్హులను గుర్తించి పథకాల అమలు కోసం సర్కారు ప్రణాళికలు రూపొందించిందన్నారు.
అన్ని మున్సిపాలిటీల్లో ఆయా వార్డు కౌన్సిలర్లు, అధికారుల పర్యవేక్షణలో అభయహస్తం కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రవేశపెట్టిన ఈ పథకంతో పేద, సామాన్య మధ్య తరగతి కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి సర్కారు పథకాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. నిజమైన అర్హులంతా తప్పకుండా దరఖాస్తులు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వేర్వేరుగా కొనసాగుతున్న ఆయా వార్డుల్లో పాల్గొన్న నాయకులు మాజీ ఎంపీపీ మల్లేశ్, మాజీ సర్పంచ్లు గంగయ్య, నర్సింహ, నరేశ్, సింగిల్ విండో చైర్మన్ కృష్ణ, వైస్ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.