వేంసూరు, సెప్టెంబర్ 22 : సీతారామ ప్రాజెక్టు పూర్తయితే కరువు మండలాలన్నీ సస్యశ్యామలమవుతాయని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. గురువారం వేంసూరు మండల పరిధిలోని రామన్నపాలెం, అడసర్లపాడు, మొద్దులగూడెం, వైఎస్బంజరు, బీరాపల్లి, కుంచపర్తి, అమ్మపాలెం, వెంకటాపురం, కందుకూరు, భరిణెపాడు గ్రామాల్లో ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన ఆసరా పింఛన్ కార్డులు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె ప్రగతితో పల్లెలు మెరుగు పడుతున్నాయన్నారు. నిరుపేదలకు భరోసా కల్పించేసేందుకే ఆసరా పింఛన్లు అందజేస్తున్నట్లు చెప్పారు. పేదరికమే గీటురాయిగా ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో వేంసూరు, తిరుమలాయపాలెం మండలాల్లో భూగర్భజలాలు సరిగా లేక కరువు మండలాలుగా ఉండేవని, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో ఎన్టీఆర్ కాలువను సత్తుపల్లి నుంచి వేంసూరు వరకు నిర్మించి నీరందించారన్నారు.
ఉమ్మడి జిల్లాలో రూ.10 కోట్లతో నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు త్వరలో పూర్తవుతుందని, తద్వారా సత్తుపల్లి నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుందన్నారు. ఇప్పటికే బుగ్గపాడు వద్ద కాల్వ పనులు పూర్తి కావొచ్చాయని, ఈ కాల్వను బేతుపల్లి చెరువుకు అనుసంధానం చేస్తే ఎన్టీఆర్ కాలువ ద్వారా బేతుపల్లి చెరువు నుంచి వేంసూరు మండలానికి నీరు చేరుతుందన్నారు. కందుకూరు గ్రామానికి చెందిన బండి కృష్ణకుమారి బ్లాక్ఫంగస్తో రూ.లక్షలు ఖర్చు చేశారని, వారి కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి భరోసా కల్పిస్తూ రూ.8 లక్షల చెక్కు అందించామన్నారు. కందుకూరులో 26 స్వయం సహాయక సంఘాలకు మంజూరైన రూ.2.60 కోట్ల చెక్కును డ్వాక్రా మహిళలకు ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ మారోజు సుమలత, వైస్ ఎంపీపీ దొడ్డా శ్రీలక్ష్మీ, తహసీల్దార్ ముజాహిద్, ఎంపీడీవో వీరేశం, ఎంపీవో రంజిత్కుమార్, పీఆర్ ఏఈ వాసుదేవరావు, ఎంఈఓ చలంచర్ల వెంకటేశ్వరరావు, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.