MLA Jagadish Reddy | సూర్యాపేట : రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ నానాటికి పడిపోతోంది.. ముఖ్యమంత్రిని చూస్తే జాలేస్తోంది అని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. నాలుగు నెలల్లోనే ఇంత ఘోరంగా విఫలమైన ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు అని తెలిపారు. సూర్యాపేటలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో ఒక్కరికంటే ఒక్కరికి రైతు భరోసా ఇచ్చినా నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ముక్కుకు నేలకు రాస్తా అని జగదీశ్ రెడ్డి సవాల్ చేశారు. 65 లక్షల మందికి ఇచ్చింది రైతు భరోసా కాదు రైతు బంధు మాత్రమే అని తెలిపారు. కేసీఆర్ అమలు చేసిన రైతుబంధు పథకాన్నే కొనసాగించారు తప్పా.. రైతు భరోసా అమలు చేయలేదన్నారు. రైతులందరికీ రైతుబంధు ఇచ్చి రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాయాలి. ఐదు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు అప్పుల పాలయ్యారు. రైతు బంధు అనేది తెలంగాణ రైతుల హక్కు. రైతు భరోసా అని మాట్లాడడం సిగ్గుచేటు. ఒక్కరికి రైతు భరోసా ఇచ్చారని నిరూపించినా ఎమ్మెల్యే పదవి రాజీనామా చేస్తా. డిసెంబర్ 9న ఇవ్వాల్సిన రైతుబంధు కాంట్రాక్టర్లకు పంచిపెట్టారు అని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.
తనకే రైతుబంధు రాలేదని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చెప్పిన తర్వాత బుద్ధి తెచ్చుకుని ప్రజల్లో చులకన అయ్యామనే భావనతోనే రేవంత్ తాజా హామీలు ఇస్తున్నారని జగదీశ్ రెడ్డి తెలిపారు. రైతుబంధు రాలేదని అంటే చెప్పుతో కొడతా అన్న మంత్రి, రైతు బంధు రాలేదని చెప్పిన మంత్రి, ముఖ్యమంత్రి ఎవరిని ఎవరు చెప్పుతో కొట్టుకుంటారో 13వ తేదీన పోలింగ్ బూతులలో ప్రజలే తేలుస్తారు. మీకు బుద్ధి చెప్పడానికి 13వ తేదీన తెలంగాణ రైతాంగం చెప్పులతో సిద్ధంగా ఉంది. కేసీఆర్కు ఛాలెంజ్ చేయడానికి సిగ్గుండాలి. రైతు భరోసా ఎక్కడా ప్రారంభం చేయలేదు. 9వ తేదీ నాటికి అందరికీ రైతుబంధు ఇచ్చి, జరిగిన ఆలస్యానికి ముఖ్యమంత్రి చెంపలు వేసుకోవాలి అని జగదీశ్ రెడ్డి సూచించారు.