Harish Rao | హైదరాబాద్ : రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం వస్తుందని, రివర్స్ గేర్లో పోతున్న కాంగ్రెస్ నుంచి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయమన్నారు హరీశ్రావు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో హరీశ్ రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. కేసీఆర్ బస్సుయాత్రకు ప్రజల్లో ఆదరణ లభిస్తోంది. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ కంటే బీఆర్ఎస్కే ఎక్కువ సీట్లు వస్తాయి. రాష్ట్రం దివాలా తీసిందనే ముఖ్యమంత్రే చెబితే పెట్టుబడులు వస్తాయా? రేవంత్ మాటల వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గింది. కేసీఆర్ హయాంలో నీళ్లు , కరెంట్ పుష్కలంగా ఉండంతో ఇతర రాష్ట్రాల నుంచి పెట్టుబడులు వచ్చాయి. ఇప్పుడా పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీకి పాలించడం చేతకాక రాష్ట్రాన్నివెనక్కి తీసుకెళ్తున్నారు. గత ప్రభుత్వంపై బురదచల్లుతూ రాష్ట్రం పరువు తీస్తున్నారు అని హరీశ్రావు మండిపడ్డారు.
రేవంత్ బీజేపీలో చేరుతారని ధర్మపురి అర్వింద్, మహేశ్వర్ రెడ్డి అంటున్నారు. దీన్ని రేవంత్ ఎందుకు ఖండించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కవిత అరెస్ట్ కాలేదు కనుక బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటని అబద్ధాలు చెప్పి మైనారిటీ ఓట్లు సంపాదించుకున్నారు. ఇప్పుడు కవిత అరెస్టయ్యారు, కుమ్మక్కైతే ఎందుకు అరెస్ట్ అవుతారు. రేవంత్ మైనారిటీలను మోసం చేస్తున్నారు. కేబినెట్లో మైనారిటీని తీసుకోలేదు. రంజాన్ తోఫా నిలిపేశారు. ఇమామ్ వేతనాలు రావడం లేదు. రేవంత్ మోదీని బడే భాయ్ అంటూ ఆశీర్వాదాలు కోరుతున్నారు. బీఆర్ఎస్ అన్ని వర్గాల పార్టీ. మైనారిటీలకు అన్యాయం జరిగితే పోరాడుతుంది. హిందూ ముస్లింలను రెండు కళ్ల మాదిరి చూసే పార్టీ బీఆర్ఎస్. బీఆర్ఎస్ను ఆదరించాలని ముస్లింలను, క్రైస్తవులను ఇతర మైనారిటీలను కోరుతున్నా. కాంగ్రెస్ హామీలు అమలు కావాలంటే ప్రశ్నించే గొంతుకను గెలిపించాలి. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం బీఆర్ఎస్తోనే సాధ్యం అని హరీశ్రావు స్పష్టం చేశారు.