జమ్మికుంట: హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలను, పార్టీ శ్రేణులను ఎమ్మెల్యే, మంత్రిగా పని చేసి ఈటల రాజేందర్ పట్టించుకోలేదని వర్ధన్నపేట్ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ పేర్కోన్నారు. మండల పరిధిలోని మాచనపల్లి మాజీ ఎంపీటీసీలు పర్లపల్లి భిక్షపతి, పోల్సాని శ్యాంసుందర్, కార్యకర్తలు శనివారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ ఎంపీటీసీలకుఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… స్ధానిక ఉద్యమ నాయకులు, ప్రజాప్రతినిధుల పట్ల ఈటల రాజేందర్ నిర్లక్ష్య ధరణితో వ్యవహరించారని అన్నారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఢిల్లీ నాయకులు గల్లీల్లో ప్రచారం చేస్తున్నారన్నారు. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పారు. ప్రజలు బీజేపీ పార్టీ నాయకుల మాయమాటలను నమ్మకుండా అభివృద్ధి చేసే సీఎం కేసీఆర్కు మద్ధతు తెలిపాలని ఆయన అన్నారు. హుజూరాబాద్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసి శ్రీరాం శ్యాం, సర్పంచ్ బొజ్జం కల్పన-తిరుపతిరెడ్డి, ఎంపీటీసీ రాజేశ్వర్రావు, రైతు బంధు సమితి జిల్లా సభ్యుడు కనపర్తి లింగారావు, నాయకులు రాంబాబుతోపాటు తదితరులు ఉన్నారు.