న్యూఢిల్లీ: లఖింపూర్ ఖేరీ హింస కేసులో నిందితుడైన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాను ఉత్తరప్రదేశ్ పోలీసులు ప్రశ్నించనున్నారు. లఖింపూర్ ఖేరీ కేసులో పోలీసులు కేంద్రమంత్రి అజయ్ మిశ్రా నివాసం వెలుపల పోలీసులు శుక్రవారం నోటీసును అతికించారు. అయితే ఆశిష్ విచారణకు హాజరు కాకపోవడంతో మరోమారు నోటీసులు జారీ చేశారు. శనివారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని అందులో స్పష్టం చేశారు.
కాగా, పోలీసుల నోటీసుపై కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా స్పందించారు. ఆరోగ్య కారణాల వల్లే తన కుమారుడు పోలీసుల ముందు హాజరు కాలేదని చెప్పారు. శనివారం ఉదయం పోలీసుల విచారణకు వెళ్తాడని మంత్రి స్పష్టం చేశారు.
లఖింపూర్ ఖేరీ ఘటన జరిగినప్పుడు తాను ఆ ప్రదేశంలో లేనని, తన కుమారుడు నిరపరాదని కేంద్రమంత్రి మొదటి నుంచి చెప్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే నిందితులిద్దరిని పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎఫ్ఐఆర్లో ఆశిష్ మిశ్రా పేరు ఉన్నప్పటికీ అతడిని అరెస్టు చేయలేదు.