రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు శనివారం మంచిర్యాల, చెన్నూర్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఆయాచోట్ల రూ. 140 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. చెన్నూర్లో రోడ్షో, దొనబండలో భారీ బహిరంగ సభ నిర్వహించనుండగా, పెద్ద సంఖ్యలో ప్రజలను తరలించి విజయవంతం చేసేందుకు నాయకులు ఏర్పాట్లు చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భారీ కటౌట్లు, జెండాలతో ప్రధాన వీధులన్నీ గులాబీమయమయ్యాయి.
మంచిర్యాల, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు మంచిర్యాల జిల్లా కేంద్రంలో నేడు పర్యటించనున్నారు. మంచిర్యాల, చెన్నూర్ నియోజకవర్గాల్లో రూ.140 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. హజీపూర్ మండలం పడ్తనపల్లిలో రూ.85 కోట్లతో నిర్మించే లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్తో మండలంలోని 10 వేల ఎకరాలకు సాగు నీరు అందనున్నది. అనంతరం దొనబండ గ్రామంలో నిర్వహించే ప్రగతి నివేదన సభలో మంత్రి పాల్గొంటారు. అక్కడి నుంచి చెన్నూర్కు చేరుకొని రూ.10 కోట్లతో నిర్మించిన 50 పడకల దవాఖానను మంత్రి ప్రారంభిస్తారు. మున్సిపల్ నిధులు, టీయూఎఫ్ఐడీసీ నిధులు, ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి ద్వారా మంజూరైన నిధులతో పలు అభివృద్ధి పనులను అంకురార్పన చేస్తారు. చెన్నూర్ పట్టణంలో రూ.2 కోట్లతో నిర్మించే మోడ్రన్ ధోబీఘాట్ పనులు, టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ.23 కోట్లతో చేపట్టే పనులకు భూమి పూజ చేస్తారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.20 కోట్లతో చేపట్టే పనులకు టెండర్లు పూర్తి కావచ్చిన దృష్ట్యా, ఆ పనులకు కూడా మంత్రి హరీశ్రావు శంకుస్థాపన చేస్తారు. అనంతరం చెన్నూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌక్లో నిర్వహించే రోడ్షోలో మంత్రి పాల్గొననున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో మంచిర్యాల జిల్లాకేంద్రంతో పాటు దొనబండలో భారీ ఏర్పాట్లు చేశారు. మంచిర్యాల, నస్పూర్ పట్టణాల నుంచి సభ నిర్వహించే దొనబండకు భారీ బైక్ ర్యాలీ తీయనున్నారు. బహిరంగ సభకు వేలాది మంది హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. చెన్నూర్ పట్టణంలో నిర్వహించే రోడ్షోకు యంత్రాంగం, అధికారులు పటిష్ట భద్రత ఉండేలా చూస్తున్నారు. చెన్నూర్ పట్టణం మొత్తం జెండాలు, భారీ కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు.
చెన్నూర్ రూరల్, అక్టోబర్ 6: ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కృషితో ఏండ్ల కల నేరవేరింది. మండలంలోని సుద్దాల వాగుపై నిర్మించిన వంతెనను మంత్రి హరీశ్ రావు నేటి ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు. బాల్క సుమన్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం కేసీఆర్తో మాట్లాడి వంతెన నిర్మాణానికి నుంచి రూ. 15 కోట్ల నిధులు మంజూరు చేయించారు. తర్వాత మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పనులు ప్రారంభించి త్వరగానే పూర్తి చేయించారు. నూతన బ్రిడ్జి అందుబాటులోకి వస్తే సుద్దాల, కిష్టంపేట, కమ్మరిపల్లి, గంగారం, కాచన్పల్లి గ్రామస్తుల కష్టాలు తీరుతాయని ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
హాజీపూర్, అక్టోబర్ 6 : మండలంలోని పడ్తన్పల్లి గ్రామ శివారులో రూ. 80.50 కోట్లతో నిర్మించే లిఫ్ట్ పనులకు మంత్రి హరీశ్ రావు శనివారం భూమి పూజ చేయనున్నారు. ఇప్పుడు పడ్తన్పల్లి లిప్టు ఏర్పాటుతో 8 వేల ఎకరాల భూమి సాగులోకి రానున్నది. ఒక్క టీఎంసీ సామర్థ్యంతో లిప్టు ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా 42వ కడెం డిస్ట్రిబ్యూటర్ కెనాల్ కింద ఉన్న లక్షెట్టిపేట మండలంలోని కొన్ని గ్రామాలతో పాటు హాజీపూర్ మండలంలోని భూములకు సాగు నీరు అందనున్నది. మండలంలో 7,500 ఎకరాల భూమి, 9 గ్రామాలు ప్రాజెక్టు ముంపునకు గురైయ్యాయి. గతంలో కడెం కాలువ, గూడెం ఎత్తి పోతల పథకం ద్వారా నియోజకవర్గంలోని మూడు మండలాల్లోని 30వేల ఎకరాలకు సాగు నీరు అందించేవారు. ఆయకట్టు చివర ఉన్న హాజీపూర్ మండలానికి సాగు నీరు పూర్తి స్థాయిలో అందకపోవడంతో ముంపు గ్రామాల రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మండలంలోనే లిఫ్ట్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే దివాకర్రావు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ విషయాన్ని ఎమ్మెల్యే సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సీఎం స్పందించి ప్రతిపాదనలు పంపాలని నీటి పారుదల శాఖ ఇంజినీర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే దివాకర్ రావు వారితో కలిసి మండలంలోని పడ్తన్పల్లి, కర్ణమామిడి గ్రామాల మధ్య అనువైన ప్రాంతాన్ని పరిశీలించి ప్రాథమిక నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి పంపించారు. దాని ఆధారంగా లిప్టు ఇరిగేషన్ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వ నిధులు మంజూరు చేస్తూ కొద్ది రోజుల క్రితం జీవో జారీ చేయడంతో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే దివాకర్ రావుకు మండల రైతులు కృతజ్ఞతలు తెలిపారు.