Minister Srinivas Yadav | బోనాల ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా పర్యవేక్షించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. నగరానికి చెందిన మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ ఈ నెల 9న సికింద్రాబాద్ బోనాలు, 16న ఓల్డ్ సిటీ బోనాలు జరుగుతాయని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వివిధ శాఖల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.
ప్రజాప్రతినిధులు ఏర్పాట్లలో భాగస్వాములై పర్యవేక్షించాలని, ఇంకా ఏమైనా అవసరాలుంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. భక్తులు క్యూలైన్లలో తోపులాటకు గురికాకుండా పటిష్టమైన బారికేడ్లను ఏర్పాటు చేయడంతో పాటు పోలీసు బందోబస్తు, శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం అవసరమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బోనాలు తీసుకొచ్చే మహిళలకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
తాగునీరు అందుబాటులో ఉంచడంతో పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా అదనపు ట్రాన్స్ఫార్మర్లు, జనరేటర్లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆలయాల పరిసరాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చూడడంతో పాటు అదనపు పారిశుధ్య సిబ్బందిని నియమిస్తున్నట్లు చెప్పారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న వారు బోనాల ఉత్సవాలను తిలకించే ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
144 దేవాలయాల వద్ద భక్తుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా ఎనిమిది చోట్ల త్రీడి మ్యాపింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బోనాల ఉత్సవాలకు వచ్చే లక్షలాది మంది భక్తులను దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. టెలీకాన్ఫరెన్స్లో ఎమ్మెల్సీలు ప్రభాకర్ రావు, సురభి వాణీదేవి, శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు గోపినాథ్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, మైనంపల్లి హన్మంతరావు, వివేక్, అరికేపూడి గాంధీ పాల్గొన్నారు.