హయత్నగర్, ఆగస్టు 8 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ హయాంలోనే ఎక్సైజ్శాఖ ఆదాయం పెరిగిందని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం హయత్నగర్లో ఎక్సైజ్శాఖ నూతన భవనం నిర్మాణానికి ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డితో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పాలకులు ఉమ్మడి రాష్ట్రంలో కేవలం ఆదాయ వనరులను ఎట్లా దోచుకోవాలో చూశారే తప్పా వచ్చిన ఆదాయాన్ని ఈ ప్రాంతంలో ఎట్లా ఖర్చు పెట్టాలో మాత్రం పట్టించుకోలేదన్నారు.
ఆదాయం వస్తున్న శాఖలను ఏనాడూ గౌరవప్రదమైన స్థానాల్లో గుర్తించిన పాపానపోలేదన్నారు.
పోలీస్ స్టేషన్లలో డొక్కు బండ్లు, కనీసం పెట్రోల్కు కూడా డబ్బులు ఇవ్వకుండా వచ్చిన వాళ్లతోనే అడుక్కునే దుస్థితికి దిగజార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాడు ఎక్సైజ్శాఖ ఆదాయం పాలకుల జేబుల్లోకి వెళ్లేదని, తెలంగాణ ఏర్పడ్డాక ఎక్సైజ్శాఖ వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరిగిందన్నారు. గత పాలకుల హయాంలో మద్యం బాటిళ్లను తయారు చేసుకునేవారని, ఎవరైనా అధికారులు వాటిని పట్టుకుంటే ఏసీబీ కేసుల్లో ఇరికించేవారని మండిపడ్డారు.
వారి గుప్పిట్లోనే అధికారం పెట్టుకుని వైన్స్ షాపులు, ఈ దందాలన్నీ జరిగేవని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వ సహకారంతో ఎక్సైజ్శాఖ పోలీసులు తుపాకులు లేకుండానే ఒడిషాలోని అభయారణ్యంలో గుట్టుచప్పుడు కాకుండా తయారు చేస్తున్న మద్యం తయారీ కేంద్రంపై దాడులు నిర్వహించి వారిపై కేసులు పెట్టిన సత్తా మన పోలీసులకు ఉందన్నారు.
తెలంగాణ ఏర్పాటైతే మతకల్లోలాలు వస్తాయని, ధరలు పడిపోతాయని కొంతమంది దుష్ప్రచారం చేశారని, ఇప్పుడు లండన్, న్యూయార్క్, అమెరికా దేశాల్లోనే లేని భూముల ధరలు తెలంగాణలో ఎకరాకు రూ.100 కోట్లు పలికిందని వివరించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్తుందనడం మనకే గర్వకారణమన్నారు. తెలంగాణ రాష్ర్టానికి ఇతర రాష్ట్రాల నుంచి మద్యం సరఫరా, నకిలీ మద్యం రవాణాపై సంబంధిత అధికారులు ఉక్కుపాదంతో అణచివేయాలని ఆదేశించారు.
ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే ఎంతటివారినైనా ఊపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా చైర్పర్సన్ అనితారెడ్డి, హయత్నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్రెడ్డి, కర్మాన్ఘాట్ ఆంజనేయస్వామి టెంపుల్ చైర్పర్సన్ ఈశ్వరమ్మ యాదవ్, మాజీ కార్పొరేటర్ సామ తిరుమలరెడ్డి, ఎక్సైజ్శాఖ కమిషనర్ ముషారఫ్, అధికారులు డేవిడ్ రవికాంత్, హన్మంతరావు, చంద్రయ్య, టి.రవీందర్రావు, అరుణ్కుమార్, సత్యనారాయణ, విజయభాస్కర్ గౌడ్, హయత్నగర్ ఎక్సైజ్శాఖ ఇన్స్పెక్టర్ టి.లక్ష్మణ్ గౌడ్, ఎస్ఐ సరళ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.