మహబూబ్నగర్ : కేంద్రంలో అధికారంలోకి రాక ముందు బీజేపీ నేతలు ఎన్నో హామీలు ఇచ్చారని.. ఇప్పుడు వాటి ఊసెత్తడం లేదని.. అధికారంలో ఉండి పాదయాత్రలు చేపట్టడం విడ్డూరంగా ఉందని మంత్రి శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. దివంగత బీజేపీ నేత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామన్నారని గుర్తు చేశారు. బండి సంజయ్ ఎందుకు పాదయాత్ర చేస్తున్నారని ప్రశ్నించారు. ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, అన్నీ ప్రైవేటు చేస్తున్నామని చెప్పేందుకు పాదయాత్ర చేపడుతున్నారా? అని విమర్శించారు.
నాయకులు మాట్లాడితే యువత, మేధావులకు ఆదర్శంగా ఉండాలని, వారంతా రాజకీయాల్లోకి రావాలని అనుకోవాలని.. కానీ ఆ నేతలు మాట్లాడే భాష విని విస్మయానికి గురవుతున్నారన్నారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు గడువు ఉన్నా ఇప్పటి నుంచే విషం చిమ్మడం తగదన్నారు. సీఎం కేసీఆర్పై చేస్తున్న వ్యాఖ్యలు సరికాదన్నారు. తాము పిలుపునిస్తే బీజేపీ నేతలు తట్టుకోలేరని, వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. తమ దృష్టి పేదల సేవ, రైతాంగ అభివృద్ధి అని స్పష్టం చేశారు. మహారాష్ట్రలో కేంద్రమంత్రిని అరెస్ట్ చేశారని, తమకు చేతకాక కాదని.. కానీ చిల్లెర మల్లెర వాళ్లను పట్టించుకోమన్నారు. పాదయాత్రలో గ్రామాల్లోని ప్రజలను 70 ఏళ్లలో జరిగిందేమిటీ? ఏడేళ్లలో ఎంత అభివృద్ధి జరిగిందో తెలుసుకోవాలని హితవు పలికారు.
సీఎంను ప్రజాప్రతినిధులు గౌరవించే తీరు ఇదేనా అని ప్రశ్నించారు. మీరు మాట్లాడే భాష ఏంటీ?.. ప్రజలు మీకు ఎదురుతిరిగి పాతాళానికి తొక్కేస్తారన్నారు. విమర్శలు విధానపరంగా ఉండాలన్నారు. ఇప్పుడు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అక్రమం అంటున్నారు.. మరి జాతీయ పార్టీలు చేస్తున్నాయన్నారు. అప్పట్లో ఏపీ సుభిక్షంగా ఉండాలని హారతులు పట్టిన వారు ఇప్పుడైనా మన రాష్ట్రం అభివృద్ధి గురించి పాటుపడాలని హితవు పలికారు. పనిచేయండి.. ప్రజల్లో అభిమానం పొందండి.. రాజకీయాలను దిగజార్చొద్దంటూ సూచించారు. ఓపికకు హద్దులుంటాయన్న సంగతి మరచిపోవద్దని.. తెలంగాణ అభివృద్ధిని డజన్ మంది కేంద్రమంత్రులు మెచ్చుకున్నారని గుర్తు చేశారు.