అనుకున్నదే జరిగింది.. కేంద్రం అన్నంత పనీ చేసింది.. రాష్ట్ర బీజేపీ నేతల మాటలెలా ఉన్నప్పటికీ ధాన్యం సేకరణపై కేంద్రం తన వైఖరి ఏమిటో తెగేసి చెప్పింది.. శుక్రవారం ఢిల్లీలో రాష్ట్ర మంత్రులు, ఎంపీల బృందంతో జరిపిన సమావేశంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, అధికారుల బృందం తమ మాట ఏమిటో తేల్చిపారేసింది. తెలంగాణ ప్రభుత్వం సూటిగా అడిగిన మూడు ప్రశ్నలు… వాటికి కేంద్రం జవాబులివి..
రాష్ట్రం ప్రశ్న :యాసంగిలో తెలంగాణలో పండే ధాన్యం మొత్తాన్నీ కేంద్రం కొంటుందా? లేదా?
కేంద్రం జవాబు: పార్బాయిల్డ్ (ఉప్పుడు బియ్యం) కొనే ప్రశ్నే లేదు.
వాస్తవం: యాసంగిలో తెలంగాణలో పండేదే పార్బాయిల్డ్ రకం దొడ్డువడ్లు.
రాష్ట్రం ప్రశ్న : తెలంగాణ నుంచి ఏడాదికి ఎంత ధాన్యం తీసుకుంటారో ముందే చెప్తారా? లేదా?
కేంద్రం జవాబు: ఈ సూచన మంచిదే.. కానీ టార్గెట్ చెప్పలేం. అలా చెప్పాలంటే వ్యవసాయ పాలసీలో మార్పులు చేయాలి.
వాస్తవం: పాలసీలో మార్పులు అవసరమైతే చేయాలి. అది కేంద్రం బాధ్యత. మద్దతు ధరను ముందే చెప్పినప్పుడు టార్గెట్ ఎందుకు చెప్పరు?
రాష్ట్రం ప్రశ్న : తెలంగాణలో వరి వేయాలని రాష్ట్ర బీజేపీ నేతలు చెప్తున్నారు. మీరేమంటారు?
కేంద్రం జవాబు: వరి వేయొద్దని మేం చెప్పడం లేదు. కానీ, రైతు లతో పంట మార్పిడి చేయించాలని అంటున్నాం. వరిపై రాష్ట్ర బీజేపీ నేతలకూ తెలిసీ తెల్వక మాట్లా డుతున్నారు.. వాళ్లకు కూడా చెప్పినం
వాస్తవం: వరి వేయొద్దనడం లేదట! కానీ, పంట మార్పిడి చేయాలట! అంటే ఏమిటో చిల్లి కాదు తూటు
దీన్ని బట్టి అర్థమైంది ఏమిటి? రాష్ట్ర బీజేపీ నేతల మాటలు విని యాసంగిలో పొరపాటున వరి వేస్తే ఆ వడ్ల (బియ్యం)ను కేంద్రం కొనదు. రైతులు నష్టపోయేది ఖాయం. అందువల్ల యాసంగిలో వరికి దూరంగా ఉండి ఇతర లాభసాటి పంటలు వేసుకోవడం ఉత్తమం.
హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): వరి ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. వానకాలం, యాసంగి సీజన్లు కలిపి ఎంత మొత్తం ధాన్యం సేకరిస్తారో స్పష్టత ఇవ్వడానికి నిరాకరించింది. యాసంగిలో వరి సాగు చేయొద్దని రైతులకు తేల్చి చెప్పింది. ధాన్యం సేకరణపై కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్గోయల్తో ఢిల్లీలో రాష్ట్ర మంత్రుల బృందం సమావేశమైంది. ధాన్యం సేకరణ ఉండబోదని పీయూష్గోయల్ స్పష్టం చేయటంతో చర్చలు విఫలమయ్యాయని రాష్ట్ర మంత్రులు తెలిపారు. ఏటా ఎంత ధాన్యాన్ని సేకరిస్తారో చెప్పాలన్న వినతికి కూడా కేంద్రమంత్రి స్పష్టమైన హామీ ఇవ్వలేదని మంత్రి నిరంజన్రెడ్డి చర్చల అనంతరం మీడియాకు తెలిపారు. సమావేశ వివరాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని చెప్పారు.
కేంద్రప్రభుత్వం ధాన్యం సేకరణపై సానుకూలంగా స్పందిస్తుందన్న ఆశతో వచ్చామని, కానీ తమకు నిరాశే ఎదురైందని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. ‘సీఎం కేసీఆర్ రెండునెలల క్రితం ధాన్యం కొనుగోలుపై చర్చలు జరిపి, అన్ని అంశాలను కొలిక్కి తీసుకొచ్చారు. కేంద్ర మంత్రితో చర్చల్లో అంతిమంగా సానుకూల నిర్ణయం వస్తదని ఆశించాం. కానీ రెండుసార్లు జరిగిన సమావేశాల్లో ఆశాజనకంగా ఇచ్చిన హామీ ఏమీలేదు. యాసంగిలో వరి వేయొవద్దని మాత్రం చాలా గట్టిగా చెప్పారు’ అని నిరంజన్రెడ్డి తెలిపారు. యాసంగి వరి విషయంలో రాష్ట్ర బీజేపీ నాయకులే గందరగోళం చేశారని గుర్తుచేయగా.. వాళ్లు తెలిసో తెలియకో మాట్లాడారని, అలా మాట్లాడొద్దని తమవాళ్లను వారించామని కేంద్రమంత్రి చెప్పారని పేర్కొన్నారు.
ఏటా ఎంత ధాన్యం సేకరిస్తారన్న తమ ప్రశ్నకు కేంద్రమంత్రి స్పష్టమైన సమాచారం ఇవ్వలేదని నిరంజన్రెడ్డి తెలిపారు. ‘ధాన్యం సేకరణలో టార్గెట్ నిర్ణయిస్తే పంటలసాగుపై రైతులను సన్నద్ధం చేసుకుంటామని సీఎం అన్న మాటలను గుర్తుచేశాం. గత సమావేశంలో సీఎం కేసీఆర్ చేసిన ఈ సూచన బాగుందని, వ్యవసాయ శాఖతో మాట్లాడి ఒక నిర్ణయానికి వస్తామని పీయూష్ గోయల్ చెప్పారు. అదే విషయంపై వైఖరి చెప్పాలని కోరాం. సీఎం కేసీఆర్ సూచన చాలా బాగుందని గోయల్ చెప్పారు. దానిపై వ్యవసాయశాఖ అధికారులతో మాట్లాడితే సంవత్సరం మొత్తానికి సంబంధించిన అంచనా ముందస్తుగా టార్గెట్ ఇవ్వడం సాధ్యంకాదని చెప్పారు. త్వరలో జాతీయస్థాయిలో ఒక కమిటీ వేసి, దాని ఆధ్వర్యంలో కొత్త చట్టాలు, ఎంఎస్పీ, పంట మార్పిడీలకు సంబంధించి విధాన నిర్ణయాలు రూపొందించే ఆలోచనలో ఉన్నామని చెప్పారు.
కమిటీ సిఫారసుల ఆధారంగా వార్షిక టార్గెట్ నిర్ణయిస్తామన్నారు’ అని నిరంజన్రెడ్డి చెప్పారు. కేంద్ర మంత్రి ఇలా మాట్లాడటం బాధాకరమని పేర్కొన్నారు. గత సమావేశంలో 80-85 లక్షల టన్నులకైనా ఆలోచిస్తామని చెప్పిన కేంద్రమంత్రి.. ఇప్పుడేమో చెప్పలేమంటూ దాటవేసే ధోరణి ప్రదర్శించారని నిరంజన్రెడ్డి విమర్శించారు. దాదాపు గంటకు పైగా జరిగిన చర్చల్లో మంత్రులు నిరంజన్రెడ్డి, మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్రావు, మల్లారెడ్డి, టీఆర్ఎస్ పార్లమెంటరీ పక్ష నేత నామా నాగేశ్వర్రావు, ఎంపీలు బీబీ పాటిల్, సురేశ్రెడ్డి, సీఎస్ సోమేశ్కుమార్, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం.. ‘ఏ రాష్ట్రమూ వడ్ల కొనుగోళ్లపై ఇంత లొల్లి చేయడం లేదు. మీరెందుకు చేస్తున్నారు?’ అని కేంద్ర అధికారులు వాదించగా.. ‘దేశంలో ఏ రాష్ట్రంలోనూ పండనంత ధాన్యం తెలంగాణలో పండుతున్నది కాబట్టే ఇక్కడి రైతుల ప్రయోజనాల కోసం ఇంతగా కొట్లాడుతున్నామని రాష్ట్ర అధికారులు బదులిచ్చారని సమాచారం. ‘ఎప్పుడో జనవరి, ఫిబ్రవరిలో చేసే యాసంగి కొనుగోళ్లకు ఇప్పుడే ఎందుకు టార్గెట్ అడుగుతున్నారు?’ అంటూ కేంద్ర అధికారులు వాదనకు దిగితే.. ‘ఇప్పుడు టార్గెట్ చెప్తే.. ఆ మేరకు పంట వేయాలని రైతులకు ముందే సూచించే అవకాశం ఉంటుంది కనుక ఇప్పుడే టార్గెట్ చెప్పమని అడుగుతున్నాం.
మద్దతు ధరను బట్టి ఎంత పంట వేసుకోవాలో ఇండికేషన్ ఇవ్వటమేకదా’ అని రాష్ట్ర అధికారులు బదులిచ్చారని తెలిసింది. ‘ఇంతకు ముందు టార్గెట్ మేరకే రాష్ట్రం బియ్యం ఇవ్వలేదని కేంద్రం అధికారులు పేర్కొంటే.. ‘కొనంది కేంద్రం. ఇప్పటికే కేంద్రం తీసుకోనిది 5 లక్షల టన్నులు ఉన్నది.. వాటిని తీసుకోకపోగా.. మీరే ఇస్తలేరని ఉల్టా మాపై నింద మోపుతున్నారు’ అంటూ రాష్ట్ర అధికారులు బలంగా వాదన వినిపించారు. సమావేశంలో కేంద్రం వైఖరి, వేసిన ప్రశ్నలు గమనిస్తే బీజేపీ సర్కారు డొల్లతనం స్పష్టంగా వెల్లడవుతున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణ రైతాంగానికి ఒక మార్గం చూపించాలన్న సీఎం కేసీఆర్ సూచన మేరకు కేంద్ర మంత్రితో సమావేశమైన మంత్రుల బృందానికి గోయల్ వ్యవహారశైలి ఆశ్చర్యం కలిగించినట్టు సమాచారం. ‘ఢిల్లీలో మాట్లాడి వెళ్లాక సీఎం కేసీఆర్ చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. నేను కూడా రాజకీయ నాయకుడినే. మాకూ కొన్ని రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి, మేమూ రాజకీయం చేస్తాం. ఏం చేయాలో మాకు బాగా తెలుసు. అదే చేస్తాం’ అని గోయల్ వ్యాఖ్యానించినట్టు సమాచారం.
రాష్ట్రమంత్రులు, ఎంపీలు, అధికారుల బృందంతో జరిగిన సమావేశంలో యాసంగి ధాన్యం తీసుకునేదే లేదని కేంద్రం తేల్చి చెప్తే.. సమావేశం ముగిసిన తర్వాత అధికారవర్గాలు మాత్రం పీఐబీ ద్వారా తెలుగు మీడియాకు లీక్ ఇచ్చాయి. ‘తెలంగాణలో ధాన్యం సేకరణ ప్రస్తుత కనీస మద్దతు ధర ప్రకారం యథాతథంగా కొనసాగుతుంది’ అనేది ఆ లీక్ సారాంశం.