హైదరాబాద్ : నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరు రిజర్వ్ ఫారెస్టులో ఇప్పపూల కోసం వెళ్లిన స్థానిక గిరిజన, ఆదివాసీలపై ఫారెస్టు సిబ్బంది దాడికి పాల్పడడంతో దాదాపు పదిమంది గాయాలు పాలు కావడంపై రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ గారు తీవ్రంగా మండిపడ్డారు.
వెంటనే గాయాలపాలైన వారిని హాస్పిటల్ కు తరలించి, మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. ఈ ఘటనపై విచారణ చేసి, దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. గిరిజనులు, ఆదివాసీల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అటవీ అధికారులు అత్యుత్సాహం చూపితే మంచిది కాదని, సంయమనం పాటించి ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా వ్యవహరించాలన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి