బాలాజీ జిల్లా : టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై ఏపీ మంత్రి ఆర్కే రోజు మరోసారి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ప్రజాదరణ కోల్పోయారని చంద్రబాబు అనడం ఆయనకు చిన్న మెదడు చితికిపోయిందే అన్న అనుమానం కలుగుతుందని ఆమె వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రులకు ర్యాంకింగ్ సర్వేపై కూడా రోజా మండిపడ్డారు. పది రోజుల ముఖ్యమంత్రికి ర్యాంకు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.
ఏపీ మంత్రి ఆర్కే రోజా గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ దర్శనంలో నటి రవళితో కలిసి రోజా శ్రీవారిని దర్శించుకుని ప్రసాదాలు తీసుకున్నారు. ఆలయం వెలుపల ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సీఎంలకు ర్యాంకింగ్ ఇస్తూ చేసిన సర్వేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ప్రాతిపదికన సర్వే చేశారో వెల్లడించాలని ఆమె డిమాండ్ చేశారు. పది రోజుల క్రితం ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన వ్యక్తికి ఐదో ర్యాంకు ఇచ్చి.. మూడేండ్లుగా నిరంతరాయంగా ప్రజల కోసం పరితపిస్తూ సంక్షేమ పథకాలు తెస్తున్న సీఎం జగన్కు అట్టడుగు ర్యాంకు ఇవ్వడమేంటని ఆమె ప్రశ్నించారు. మా నేత జగన్కు చివరి ర్యాంకు ఇవ్వడంతోనే సర్వే సంస్థ లక్ష్యమేమిటో తెలిసిపోయిందన్నారు.
ఇలాంటి సర్వేలన్నీ బోగస్ బాబు చంద్రబాబు చేయిస్తారని, ఆయన చేయించే సర్వేలన్నీ బోగస్ సర్వేలే అని రోజా దుయ్యబట్టారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ చంద్రబాబు ఇలాంటి జిమ్మిక్కులు చాలానే చేస్తాడని అన్నారు. సర్వేల పేరుతో తన గ్రాఫ్ పెంచుకోవడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. చిన్న మెదడు చిట్లిపోయిన చంద్రబాబు, లోకేష్లను త్వరగా మెంటల్ ఆసుపత్రిలో చేర్పించాలన్నారు. చంద్రబాబు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఆయనను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.