Land Titling Act | ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై ఏపీ సీఎం వైఎస్ జగన్ తొలిసారిగా స్పందించారు. ప్రజల ఆస్తులను కొట్టేసేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేస్తున్న ఆరోపణలను ఖండించారు. విశాఖపట్నం జిల్లా పాయకరావుపేటలో నిర్వహించిన బహిరంగ సభలో జగన్ స్పందించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ భూములు ఇచ్చేవాడే కానీ.. భూములు లాక్కునేవాడు కాదని స్పష్టం చేశారు.
ప్రజల భూములపై వారికే సర్వహక్కులు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముఖ్య ఉద్దేశమని వైఎస్ జగన్ వెల్లడించారు. ఎప్పుడో వందేండ్ల కిందట బ్రిటిషర్ల కాలంలో భూముల సర్వే జరిగిందని.. అప్పట్నుంచి మళ్లీ భూముల సర్వే జరగలేదని తెలిపారు. దీనివల్ల భూముల సబ్ డివిజన్ జరగకపోవడంతో క్రయవిక్రయాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. వాటిని దూరం చేసేందుకే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 15వేల సచివాలయాల్లో సర్వేయర్లను నియమించి భూముల రీసర్వే జరిపిస్తున్నామని స్పష్టం చేశారు. ఎవరి భూమి మీద వారికి సంపూర్ణ హక్కులు కల్పించేందుకే భూముల రీసర్వే ప్రక్రియ మొదలుపెట్టామని తెలిపారు. సర్వే పూర్తి చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ పత్రాలు వారికి అందిస్తామని చెప్పారు. ఇంతటి మహత్తరమైన కార్యక్రమానికి మద్దతు తెలపకుండా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ఎవరికి ఎలాంటి నష్టం ఉండదని అన్నారు. ప్రజలకు నష్టం కలిగించే ఏ ఒక్క పని తాను చేయనని స్పష్టం చేశారు.