మామిళ్లగూడెం, మే 1: లోక్సభ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ సూచించారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణ, హోం ఓటింగ్, ఓటర్ స్లిప్పుల పంపిణీ తదితర అంశాలపై ఇతర ఉన్నతాధికారులతో కలిసి జిల్లా ఎన్నికల అధికారులతో బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య ఆధారంగా అవసరమైన అదనపు బ్యాలెట్ యూనిట్ల ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని, ఈవీఎం యంత్రాలపై బ్యాలెట్ పత్రాల కమిషనింగ్కు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కాగా, ఈ వీసీలో ఖమ్మం నుంచి కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ.. ఓటర్ల తుది జాబితా రూపొందించి గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులకు అందజేశామని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, ఇతర అధికారులు ఎం.రాజేశ్వరి, వినోద్, సన్యాసయ్య, శ్రీనివాసరెడ్డి, రాజేందర్, మధు, అరుణ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.