హైదరాబాద్ : హైదరాబాద్లో రూ. 5 వేల కోట్లతో రెండు స్కైవేలను నిర్మించే యోచనలో ప్రభుత్వం ఉందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ ఇవాళ పర్యటించారు. ఈ సందర్భంగా రూ.138 కోట్ల నిధులతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. బాచుపల్లి-ఓఆర్ఆర్ రోడ్డు విస్తరణ, ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. పేట్ బషీరాబాద్లో ఎస్టీపీలకు, కూకట్పల్లిలో నాలా విస్తరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. స్కైవేల నిర్మాణానికి రక్షణ శాఖ భూములు కావాలి. భూములు ఇవ్వాలని ఏడున్నరేళ్లుగా కేంద్రాన్ని అడుగుతున్నాం. భూములిస్తే డబ్బులు లేదా మరో చోట భూమి ఇస్తామని చెప్పాం. ఇరవై సార్లు అడిగినా కేంద్రం ఇంత వరకు స్పందించలేదు. కేంద్రంలోని బీజేపీ హైదరాబాద్కు పైసా సాయం చేయలేదు. హైదరాబాద్ అభివృద్ధికి బడ్జెట్లో రూ. 7,800 కోట్లు కోరాం. గుజరాత్కు మాత్రం వెంటనే వరద సాయం చేస్తారు. ఈ బడ్జెట్లోనైనా ఏమైనా సాయం చేస్తారేమో చూడాలి. తెలంగాణ ఎంపీలు పార్లమెంట్లో రాజీలేని పోరాటం చేయాలి. తెలంగాణ పట్ల కేంద్రం దుర్నీతి, వివక్షను ప్రజలకు వివరిస్తాం అని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, సురభివాణీ దేవి పాల్గొన్నారు.